వైద్యరంగంలో సమూల మార్పులు
ABN , First Publish Date - 2020-05-29T09:25:51+05:30 IST
రాష్ట్ర వైద్య రంగంలో సమూల మార్పులు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణశ్రీనివాస్(నాని) తెలిపారు.
పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యం
ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని
మెడికల్ కాలేజీల ఏర్పాటుకు భూముల పరిశీలన
పిడుగురాళ్ల, బాపట్ల, మే 28: రాష్ట్ర వైద్య రంగంలో సమూల మార్పులు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణశ్రీనివాస్(నాని) తెలిపారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం పిడుగురాళ్ల సమీపంలో, బాపట్ల పట్టణంలోని చెరువుజమ్ములపాలెం రోడ్డులో భూములను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ స్థానాల్లోనూ మెడికల్ కళాశాలలు ఉండే విధంగా సీఎం జగన్ యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ మెడికల్ కళాశాల ఏర్పా టుతో పల్నాడు ప్రాంతానికి ఎంతో మేలు కలు గుతుందన్నారు.
ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ రానున్న మూడేళ్లలో నిర్మాణాలను పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. పల్నాడుకు వైద్యపరంగా ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట వేయటం జరిగిందని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలిపారు. బాపట్ల పట్టణంలో మంత్రితో కలిసి స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ కళాశాల నిర్మాణానికి తన స్నేహితుడు సూర్యసత్యనారాయణరాజు 25ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చారని ఇంకా 28ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్, డీఎంఎం డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, ఆరోగ్యశ్రీ అధికారి డాక్టర్ శివారెడ్డి, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, ఆరోగ్యశాఖ కమిషనర్ డాక్టర్ రామకృష్ణ, సబ్ కలెక్టర్ కె.దినేష్కుమార్, మున్సిపల్ కమీషనర్ ఎ.భానుప్రతాప్ వైద్యవిధాన మండలి చైర్మన్ సాంబశివారెడ్డి, డీఎంహెచ్వో యాస్మిన్, ఆర్డీవో పార్థసారధి, డాక్టర్ వున్నం నాగమల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
కామేపల్లి శివారు ప్రాంతంలోని సుమారు 100 ఎకరాల పైగా ఉన్న ప్రభుత్వ భూమిలో రైతులు సాగుచేసుకుంటుతుండగా, ఆ భూమి మెడికల్ కళాశాల నిర్మాణానికి ఉపయోగపడుతుందా లేదా అని పరిశీలించేందుకు మంత్రి ఆళ్ల నాని, కలెక్టర్ వచ్చారు. ఆ భూమిని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా ఉంటున్న పేద రైతులు మంత్రిని కలిసి న్యాయం చేయాలని వేడుకొనేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకొని పక్కకు తీసుకెళ్లారు.