పెళ్లికొచ్చిన వారిలో 95మందికి కరోనా.. రెండో రోజే వరుడు మృతి!
ABN , First Publish Date - 2020-07-01T01:26:29+05:30 IST
పెళ్లి చేసుకున్న రెండో రోజే వరుడు మరణించాడు. అలాగే అతని పెళ్లికి హాజరైన అతిథుల్లో 95మందికి కరోనా సోకినట్లు వెల్లడయింది.
పట్నా: పెళ్లి చేసుకున్న రెండో రోజే వరుడు మరణించాడు. అలాగే అతని పెళ్లికి హాజరైన అతిథుల్లో 95మందికి కరోనా సోకినట్లు వెల్లడయింది. ఈ ఘటన బిహార్ రాజధాని పట్నాలో వెలుగుచూసింది. ఓ 30ఏళ్ల పట్నా యువకుడు గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అతనికి కొన్ని రోజులుగా ఆరోగ్యం సరిగాలేదు. అతనిలో కరోనా లక్షణాలు కనిపించినా కుటుంబసభ్యులు పట్టించుకోలేదు. ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలేసి పెళ్లి తంతు నిర్వహించారు. అలా పెళ్లి చేసుకున్న రెండో రోజే సదరు వరుడు మరణించాడు. ఆ పెళ్లికి వచ్చిన వారిలో కనీసం 95మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది. సదరు పెళ్లికొడుకు మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించడానికి ముందే అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై అధికారులు స్పందించారు. సదరు కుటుంబం ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిందని, వరుడిలో కరోనా లక్షణాలు కనిపించినా పెళ్లి వేడుక నిర్వహించిందని అధికారులు ఆరోపించారు.