మూసీనది ప్రక్షాళన పర్యవేక్షణకు కమిటీ
ABN , First Publish Date - 2020-09-27T20:21:27+05:30 IST
మూసీనది ప్రక్షాళన పర్యవేక్షణకు రిటైర్డ్ జస్టిస్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
ఢిల్లీ : తెలంగాణలో మూసీనది ప్రక్షాళన పర్యవేక్షణకు రిటైర్డ్ జస్టిస్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన..జస్టిస్ విలాస్ అప్జల్పుర్కర్ నేతృత్వంలో ఎన్జీటీ కమిటీ వేసింది. కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులు, హైదరాబాద్ కలెక్టర్ను కమిటీలో సభ్యులుగా ఎన్జీటీ నియమించింది. నెల రోజుల్లో మానిటరింగ్ కమిటీ తొలి సమావేశం నిర్వహించాలని ఎన్జీటీ ఆదేశించింది. నాలుగు నెలల్లో తొలి నివేదిక అందజేయాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిలో మూసీ ప్రక్షాళన పూర్తి చేయాలని నేషనల్ గ్రీన్ టిబ్యునల్ సూచించింది.
అయితే.. ఇప్పటి వరకు మూసీ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంచనా వ్యయం కూడా అధికంగా వేసినట్లు గుర్తించామని ఎన్జీటీ తెలిపింది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలిస్తే సాధారణ ధర కంటే 20 రెట్లు అధికంగా అంచనా వేశారని ఎన్జీటీ తేల్చింది. మూసీ నది ప్రక్షాళనపై మహ్మద్ నహీం పాషా వేసిన పిటిషన్పై లిఖితపూర్వక ఆదేశాలను వెబ్సైట్లో ఎన్జీటీ పొందుపరిచింది.