తడిసిన శనగ కొనుగోళ్లకు గ్రీన్సిగ్నల్
ABN , First Publish Date - 2021-04-21T05:05:09+05:30 IST
జిల్లాలో వర్షానికి తడిసిన బుడ్డశనగ కొనుగోళ్లకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ మంగళవారం జీఓ జారీ చేసింది.
క్వింటా రూ.4,500
కడప, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వర్షానికి తడిసిన బుడ్డశనగ కొనుగోళ్లకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ మంగళవారం జీఓ జారీ చేసింది. జిల్లాలో రబీ పంటగా బుడ్డశనగ సుమారు 75 వేల హెక్టార్లలో సాగు చేశారు. నవంబరులో కురిసిన భారీ వర్షానికి పంట తడిసి దెబ్బతింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం శనగ కొనుగోళ్లకు మద్దతు ధర రూ.5100గా నిర్ణయించింది. ఆ మేరకు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. అయితే నిబంధనల మేరకు 3 శాతం లోపే వర్షానికి తడిసి రంగు మారి ఉండాలి. దీంతో ఎక్కువ మంది రైతులు లబ్ధిపొందలేని పరిస్థితి ఉంది. ఈ విషయాలపై మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ పి.సుధాకర్, ఆర్డీడీ లావణ్య, ఏడీ హిమశైల, మార్క్ఫెడ్ మేనేజర్ నాగరాజు తడిసిన శనగ కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వరకు తడిసిన శనగ కొనుగోళ్లకు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మార్క్ఫెడ్ మేనేజర్ నాగరాజు ఆంధ్రజ్యోతికి వివరించారు.