పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్?
ABN , First Publish Date - 2022-05-17T09:12:34+05:30 IST
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీల (మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్)కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
- ఫైలుపై సీఎస్ సోమేశ్కుమార్ సంతకం..!
- కోర్టు తీర్పునకు లోబడి బదిలీలకు అనుమతి
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీల (మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్)కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫైలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సంతకం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్ల ఉద్యోగుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, ఒక జోన్ నుంచి మరో జోన్కు, ఒక మల్టీ జోన్ నుంచి మరో జోన్కు పరస్పర బదిలీలు కోరుకునే ఉద్యోగులు, అధికారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే... ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పరస్పర బదిలీ కోరుకునేవారికి ఎలాంటి సీనియారిటీ రక్షణ ఉండదంటూ
మొదట్లో జారీ చేసిన జీవో 21లో ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పరస్పర బదిలీలు కోరుకునేవారి సీనియారిటీని పరిరక్షించాలని సంఘాలు డిమాండ్ చేశాయి. ఆ మేరకు జిల్లా క్యాడర్ పోస్టుల పరస్పర బదిలీలకు సీనియారిటీ రక్షణ కల్పిస్తూ మళ్లీ 402 జీవోను ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవోపై కొందరు ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. సీనియారిటీ రక్షణతో ఇతర జిల్లాల నుంచి వచ్చే ఉద్యోగుల కారణంగా అప్పటికే ఆయా జిల్లాల్లో పని చేస్తున్న తమ సీనియారిటీలో తేడాలు వస్తాయని, కొత్తగా వచ్చేవారు తమకంటే సీనియర్లు అయ్యే అవకాశముందంటూ కోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు కోర్టు 402 జీవోను సస్పెండ్ చేసింది. దాంతో పరస్పర బదిలీలు నిలిచిపోయాయి. అయితే... ఇటీవల ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పరస్పర బదిలీలపై స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై కోర్టు తీర్పును వెలువరించాల్సి ఉంది. అయితే... ఈలోపు సీఎస్ సోమేశ్ కుమార్ పరస్పర బదిలీల జీవోపై సంతకం చేసినట్లు తెలిసింది. కోర్టు తీర్పునకు లోబడి పరస్పర బదిలీలు చేసుకోవచ్చంటూ ఆయా శాఖల అధికారులకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.