సైన్యంలో అమ్మాయిలకు గ్రీన్ సిగ్నల్
ABN , First Publish Date - 2021-09-09T07:58:59+05:30 IST
సాయుధ బలగాల్లో చేరడానికి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అమ్మాయిలకు రక్షణ దళాలు ఇక నుంచి స్వాగతం పలకనున్నాయి. ..
రక్షణ దళాల ఉన్నతాధికారుల నిర్ణయం
సుప్రీం కోర్టుకు వెల్లడించిన కేంద్రం
అఫిడవిట్ దాఖలుకు సమయం కావాలి
ఈ ఏడాదికి యథాతథంగా పరీక్ష
అనుమతించాలని కోరిన ప్రభుత్వం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: సాయుధ బలగాల్లో చేరడానికి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అమ్మాయిలకు రక్షణ దళాలు ఇక నుంచి స్వాగతం పలకనున్నాయి. ఈ మేరకు ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం బుధవారం ప్రకటించింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), నేవల్ అకాడమీ (ఎన్ఏ) ల్లో ప్రవేశం, శిక్షణ కోసం అమ్మాయిలను కూడా అనుమతించనున్నట్టు పేర్కొంది. ఇప్పటివరకు ఇంటర్ చదివిన, పెళ్లికాని అబ్బాయిలు మాత్రమే వీటిలో ప్రవేశానికి అర్హులు. అయితే ఈ నిబంధన వల్ల అమ్మాయిలు అవకాశాలు కోల్పోతున్నారని, ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ కుష్ కల్రా అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమ్మాయిలను కూడా ఎన్డీఏ, ఎన్ఏ పరీక్షలకు అనుమతించేలా యూపీఎస్సీని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. గత నెలలో దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఆయా పరీక్షలకు అమ్మాయిలను అనుమతించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయంపై బుధవారం సుప్రీంకోర్టులో మళ్లీ విచారణ జరిగింది. అమ్మాయిలను ఎన్డీఏ, ఎన్ఏ విభాగాల్లోకి అనుమతించాలని డిఫెన్స్ ఫోర్సె్సకు చెందిన ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్టు ఈ సందర్భంగా కేంద్రం కోర్టుకు తెలిపింది.
దీనిపై విధివిధానాలను రూపొందించి అఫిడవిట్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని కోరింది. అయితే ఈ ఏడాదికి పరీక్షను యథాతథంగా నిర్వహించడానికి అనుమతివ్వాలని కోర్టును అభ్యర్థించింది. దీనికి స్పందిస్తూ... కోర్టు ఆదేశాలు ఇచ్చేవరకు వేచిచూడకుండా రక్షణ దళాలు తమంతట తామే చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. రెండు వారాల తర్వాత మళ్లీ ఈ అంశంపై విచారణ చేపడతామని పేర్కొంది. కాగా... ఎన్డీఏ, ఎన్ఏలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలన్న కేంద్రం నిర్ణయం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు, గురుకుల కాలేజీల్లోని అమ్మాయిలు డిఫెన్స్ అకాడమీల్లో ప్రవేశం పొందేలా ప్రోత్సహించాలని అధ్యాపకులకు సూచించారు. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులను కోరారు.