చెలరేగిపోతున్నారు

ABN , First Publish Date - 2022-05-23T06:43:49+05:30 IST

మండలంలోని మెట్ట ప్రాంతాలైన ద్వారపూడి, కేశవరం గ్రామాల్లో ప్రభుత్వ భూములు, ఎర్ర కొండలే టార్గెట్‌గా మాఫియా రెచ్చిపోయి తవ్వకాలు సాగిస్తోంది. పగలు అనుమతులు వున్నచోట, చీకటిపడితే అక్ర మంగా తవ్వుతున్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారుల కనుసన్నల్లో సాగుతున్న ఈ దందాకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది.

చెలరేగిపోతున్నారు
ద్వారపూడిలో జరుగుతున్న గ్రావెల్‌ తవ్వకాలు

  • పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు
  • శని, ఆదివారాలు వస్తే మాఫియాకు పండగే

మండపేట, మే 22: మండలంలోని మెట్ట ప్రాంతాలైన ద్వారపూడి, కేశవరం గ్రామాల్లో ప్రభుత్వ భూములు, ఎర్ర కొండలే టార్గెట్‌గా మాఫియా రెచ్చిపోయి తవ్వకాలు సాగిస్తోంది. పగలు అనుమతులు వున్నచోట, చీకటిపడితే అక్ర మంగా తవ్వుతున్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారుల కనుసన్నల్లో సాగుతున్న ఈ దందాకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులే పై గ్రామాల్లో గ్రావెల్‌, మట్టి అక్రమంగా తరలించడం పరిపాటిగా మారింది. ద్వారపూడి శివారులోని గొల్లలమెట్ట, పంగిడిచెరువులతో పాటు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల చెంతనే అక్రమ తవ్వకాలు సాగిస్తూ ప్రభుత్వ ఆదా యానికి భారీగా గండికొడుతున్నారు. కేశవరం గ్రామంలోని దూకుడుమెట్ట, కోకోకోలా వెనుక ప్రభుత్వ భూములే లక్ష్యంగా చీకటిపడితే చాలు గ్రావెల్‌ గ్యాంగ్‌ రెచ్చిపోతోంది. అక్రమ తవ్వకాలు జరుగుతున్నా విజిలెన్స్‌, మైనింగ్‌, రెవెన్యూ శాఖల అధికారులు కన్నెత్తిచూడట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాఫియా ఇచ్చే మామూళ్లకు అలవాటు పడ్డ అధికారులెవరు గ్రావెల్‌ తరలింపును అడ్డుకోవట్లేదు. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందాన ఇక్కడ అధికార పార్టీకి చెందిన చోటా నాయకులు గ్రావెల్‌ తవ్వకాలకు పాల్పడుతున్నారు. ఇక శని, ఆదివారాలు వస్తే క్వారీలు తవ్వుకునే వారికి పండగే. మరోపక్క మైనర్‌ ఇరిగేషన్‌కు చెందిన ద్వారపూడి, కేశవరం గ్రామాల్లో చెరువుల్లో మట్టి తవ్వకాలపైనామాఫియా కన్నేసింది. చెరువులు పూడిక, మట్టితీత ముసుగులో విలువైన మట్టిని తవ్వుకునే ఆర్డర్‌ దక్కించుకుని మట్టిని ఇటుక బట్టీలు, నర్సరీలు, లే అవుట్లకు తరలించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేశవరంలోని గనిపోతురాజు చెరువులో మట్టి తవ్వకాలను రైతులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇక వరి కోతలు పూర్తి కావడంతో మండపేట నియోజకవర్గంలోని చేలల్లో వున్న నల్లమట్టిని అనుమతి లేకుండా ఇటుక బట్టీల కోసం తవ్వేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల్లో ఇప్పటికే మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండానే పంట పొలాల్లో మట్టిని ఎక్స్‌కవేటర్ల సాయంతో తవ్వి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. భూముల్లో మెరక పనుల పేరిట సాగుతున్న ఈ దందాకు అధికారులు కూడా చేయూతనివ్వడంతో నియోజకవర్గంలో గ్రావెల్‌, మట్టి మాఫియా చెలరేగుతోంది. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 


Updated Date - 2022-05-23T06:43:49+05:30 IST