గ్రావెల్‌పై కన్ను!

ABN , First Publish Date - 2021-09-05T05:12:52+05:30 IST

తాడికొండ మండ లంలోని లచ్చన్నగుడిపూడిలో రూ.కోట్ల విలువ చేసే గ్రావెల్‌ నిక్షేపాలపై కొంతమంది పెద్దల కన్ను పడింది.

గ్రావెల్‌పై కన్ను!
లచ్ఛన్నగుడిపూడిలో అటవీ భూమిని సర్వే చేస్తోన్న సిబ్బంది

లచ్చన్నగుడిపూడిలో గ్రావెల్‌ నిక్షేపాలు..

150 ఎకరాలను తవ్వేసేందుకు సన్నాహాలు

రిజర్వు ఫారెస్టు భూమిని రెవెన్యూ ఫారెస్టుగా చిత్రీకరించే ప్రయత్నం

వాటాదారుల్లో రెండు జిల్లాల వైసీపీ నేతలు


గుంటూరు, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): తాడికొండ మండ లంలోని లచ్చన్నగుడిపూడిలో రూ.కోట్ల విలువ చేసే గ్రావెల్‌ నిక్షేపాలపై కొంతమంది పెద్దల కన్ను పడింది. ఆ గ్రామంలోని అటవీ శాఖ కొండ దిగువున ఉన్న సుమారు 150 ఎకరాల్లో గ్రావెల్‌ తవ్వేసేందుకు ప్రయత్నాలు జోరందుకొన్నాయి. స్థానిక నేతలతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన నాయకులు కూడా ఇం దులో చేతులు కలిపినట్లు సమాచారం. ఐదు సర్వే నెంబర్లలో రిజర్వు ఫారెస్టు భూమిని  రెవెన్యూ ఫారెస్టు భూమిగా మార్చి ఆ తర్వాత తమ ఆధీనంలోకి తీసుకొని గ్రావెల్‌ తవ్వకాలకు ఆటంకం లేకుండా చేసుకొనేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తు న్నారు. ఈ వ్యవహారంలో వేరే జిల్లాకు చెందిన ఒక అమాత్యు డి సోదరుడు పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

లచ్చన్నగుడిపూడిలో ప్రకృతి సోయగాల నడుమ అటవీ ప్రాంతంలో గ్రావెల్‌ నిక్షేపాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ప్రైవేటు భూమిలో లీజుకు తీసుకొని కొంతమంది పెద్దఎత్తున గ్రావెల్‌ క్వారీయింగ్‌ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా భారీ లోతులో గ్రావెల్‌ని తోడేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనక వైసీపీ నేత కుటుంబ సభ్యులున్నారన్న విషయం బహిరంగ రహస్యమే. ఇదిలావుంటే ఇక్కడి అటవీ శాఖ భూమిపై మరో జిల్లా నాయకుడి కన్ను పడింది. సుమారు 150 ఎకరాలను రిజర్వు ఫారెస్టు నుంచి డీఫారెస్టు చేసేం దుకు ఉన్నతస్థాయిలోనే ప్రయత్నాలు ఊపందుకొ న్నాయి. వివిధ సర్వే నెంబర్లలో ఉన్న ఈ భూమికి సంబంధించి వారం క్రితం సర్వే, రెవెన్యూ శాఖల అధికారులు ఫీల్డ్‌ సర్వే కూడా చేశారు. భూమి రికార్డులు తారుమారు చేసి అటవీ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. 

ఇప్పటికే లాం కొండ చుట్టూ 40 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో గ్రావెల్‌ని పెద్దఎత్తున తవ్వేశారు. అయినప్పటికీ రెవెన్యూ, పోలీసు అధికారులు అక్రమాలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇందుకు కారణం ఎవరైతే గ్రావెల్‌ తవ్వేశారో వారి వెనక అధికార పార్టీ నేత ఉండటమే. కాగా ఇప్పుడు లచ్చన్నగుడిపూడిలో గ్రావెల్‌ ఖనిజంపై అదే పార్టీకి చెందిన వారి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర అటవీశాఖ ఈ రిజర్వు భూమిని కాపాడుకోవడంపై దృష్టి సారించకపోతే ప్రకృతి ప్రసాదమైన భూమి అన్యాక్రాంతమై పోవడం ఖాయం.  

Updated Date - 2021-09-05T05:12:52+05:30 IST