పొరిగింటి 19 ఏళ్ల అమ్మాయితో పరారైన తాతయ్య!

ABN , First Publish Date - 2020-07-12T03:33:13+05:30 IST

19 ఏళ్ల అమ్మాయి పొరుగింటి వ్యక్తితో పరారైంది. అతడేమీ యువకుడు కాదు, అలాగని పైళ్లయి పిల్లలున్నోడూ

పొరిగింటి 19 ఏళ్ల అమ్మాయితో పరారైన తాతయ్య!

గుజరాత్: 19 ఏళ్ల అమ్మాయి పొరుగింటి వ్యక్తితో పరారైంది. అతడేమీ యువకుడు కాదు, అలాగని పైళ్లయి పిల్లలున్నోడూ కాదు.. ఏకంగా మనవళ్లు ఉన్న తాతయ్య అతడు. గుజరాత్‌లో జరిగిందీ ఘటన. విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోవడంతో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. బాధిత కుటుంబానిది పటాన్ జిల్లాలోని సిధ్‌పూర్ తాలూకాలోని గ్రామం. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. యువతి సోదరుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. 


తమ పొరుగింటి వ్యక్తి అయిన షోవాంజీ ఠాకూర్ తన సోదరిని బలవంతంగా అపహరించి తీసుకెళ్లి నిర్బంధించాడని, పోలీసులు ఈ కేసును చాలా సాధారణంగా తీసుకున్నారని పేర్కొన్నాడు. గత నెల 22న కేసు హియరింగుకు రాగా పిటిషనర్ తరపు న్యాయవాది బాధిత కుటుంబ సభ్యుల భయాందోళనను కోర్టు ముందు ఉంచారు. అలాగే, యువతిని తీసుకెళ్లిన ఠాకూర్ పెద్ద కుమార్తెకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. యువతిని వెతికి తీసుకొచ్చి కోర్టు ఎదుట హాజరు పరచాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని అభ్యర్థించారు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలుస్తోంది. 


బాధిత కుటుంబం తరపు లాయర్ కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి గత నెల 2న అదృశ్యమైంది. ఆమె కోసం వెతికినా ఫలితం లేకపోయింది. చివరికి పొరిగింటి తాతయ్యే ఆమెను తీసుకెళ్లాడని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడానికి మూడు రోజులు పట్టింది. తాతయ్యతో వెళ్లింది బాలిక కాదని, యువతి కావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు.


తమ కుమార్తె భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, అలాగే, ఆమె లైంగికంగా వేధింపులకు గురవుతుండవచ్చని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసును విచారించిన కోర్టు జూన్ 29న యువతిని హాజరు పరచాలని పోలీసులను ఆదేశిస్తూ వాయిదా వేసింది.


ఆ తర్వాతి హియరింగులో.. యువతిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందుకు మరి కొంత సమయం కావాలని పోలీసులు కోరారు. దీంతో ఈ నెల 13 వరకు కోర్టు సమయం ఇచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యువతిని తమ ఎదుట ప్రవేశపెట్టాలని ఆదేశించింది. అంతేకాదు, ఈ కేసులో తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదిక (ఏటీఆర్)తో వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరు కావాలంటూ పటాన్ ఎస్పీని కోర్టు ఆదేశించింది. 


Updated Date - 2020-07-12T03:33:13+05:30 IST