అమలాపురంలో సాత్విక్ సాయిరాజ్కు ఆత్మీయ సన్మానం
ABN , First Publish Date - 2022-05-20T06:19:36+05:30 IST
థామస్ కప్ పోటీల్లో ఎనలేని ప్రతిభ చాటిన క్రీడాకారునిగా రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ పేరు చిరకాలం నిలిచి ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు.
అమలాపురం టౌన, మే 19: థామస్ కప్ పోటీల్లో ఎనలేని ప్రతిభ చాటిన క్రీడాకారునిగా రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ పేరు చిరకాలం నిలిచి ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. థామస్ కప్లో విజయం సాధించిన అనంతరం గురువారం రాత్రి పట్టణానికి చేరు కున్న సాత్విక్కు క్రీడాకారులు, క్రీడాభిమానులు, రాజకీయ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. బ్యాడ్మింటనతో పాటు వేసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులు జాతీయ పతాకాలను చేతబూని సాత్విక్కు స్వాగతం పలికారు. తొలుత స్థానిక గడియార స్తంభం సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహానికి సాత్విక్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గడియార స్తంభం సెంటర్లో సాత్విక్ సాయిరాజ్తో పాటు తల్లిదండ్రులు కాశీవిశ్వనాథం-రంగమణి దంపతులకు దుశ్శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు. పలువురు వక్తలు సాత్విక్ క్రీడా ప్రతిభను కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు, ఆర్డీవో ఎనఎస్వీబీ వసంతరాయుడు, బ్యాడ్మింటన అసోసియేషన జిల్లా అధ్యక్షుడు మెట్ల రమణబాబు, మున్సిపల్ మాజీ చైర్మన చిక్కాల గణేష్, కోనసీమ జేఏసీ చైర్మన వాసా ఎస్ దివాకర్, కన్వీనర్ బండారు రామ్మోహనరావు, పంచాయతీరాజ్ డీఈ అన్యం రాంబాబు, చెల్లుబోయిన శ్రీనివాస్, కరాటం ప్రవీణ్, డాక్టర్ కొప్పుల నాగమానస, ఎంఏకే భీమారావు, నల్లా మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.