వివాహితపై గ్రామ వలంటీర్‌ వేధింపులు.. పిలిచిన చోటికి రాకుంటే ఇల్లు, స్థలం రానివ్వనంటూ..

ABN , First Publish Date - 2020-08-04T22:40:55+05:30 IST

మండల కేంద్రంలోని ఉయ్యాలకుంట కాలనీకి చెందిన గ్రామ వలంటీర్‌ సుబ్రహ్మణ్యం(సుబ్బు) అనే యువకుడు ఒక వివాహితను వేధింపులకు గురిచేశాడు. వివరాల్లోకి వెళ్తే.... ఉయ్యాలకుంట

వివాహితపై గ్రామ వలంటీర్‌ వేధింపులు.. పిలిచిన చోటికి రాకుంటే ఇల్లు, స్థలం రానివ్వనంటూ..

ఐలవ్‌యూ అంటూ ప్రేమలేఖ

ధర్నాకు దిగిన బాధిత కుటుంబ సభ్యులు


నార్పల(అనంతపురం) : మండల కేంద్రంలోని ఉయ్యాలకుంట కాలనీకి చెందిన గ్రామ వలంటీర్‌ సుబ్రహ్మణ్యం(సుబ్బు) అనే యువకుడు ఒక వివాహితను వేధింపులకు గురిచేశాడు. వివరాల్లోకి వెళ్తే.... ఉయ్యాలకుంట కాలనీకి చెందిన ఓ వివాహితకు గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్న సుబ్బు ప్రేమలేఖ రాశాడు. అందులో ఐ లవ్‌యూ అంటూ తన ఫోన్‌ నెంబర్‌ వేసి ఆమెకు అందజేశాడు. దీనిపై ఆమె స్పందించలేదు. అంతటితో ఆగని వలంటీర్‌ నేను చెప్పినట్లు వినకపోయినా... నేను రమ్మన్న చోటకు రాకపోయినా... నీకు ఇంటి స్థలం, ఇల్లు, ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాన్ని రానివ్వకుండా చేస్తానని బెదిరింపులకు దిగాడు. మనోవేదనకు గురైన ఆమె ఇంట్లో కుటుంబసభ్యులకు తెలియజేసింది.


 వెంటనే వారు ఆమెతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం ముందు మూడు గంటల పాటు ధర్నా చేపట్టారు. తమకు ఎలాంటి సంబంధం లేదని వలంటీర్‌ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ వర్కర్‌ ప్రభుదాస్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశాడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. గ్రామ పంచాయతీ వర్కర్‌ ప్రభుదాస్‌, వలంటీర్‌ సుబ్బుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేని పక్షాన తమ కుటుంబమంతా ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. అక్కడే ఉన్న వలంటీర్‌పై కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. దీనిపై ఎంపీడీఓ దివాకర్‌, తహసీల్దార్‌ శ్రీధర్‌మూర్తి స్పందించి గ్రామ వలంటీర్‌ సుబ్బును విధుల నుంచి తప్పిస్తామన్నారు. అలాగే పంచాయతీ వర్కర్‌ ప్రభుదా్‌సపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే వివాహిత కుటుంబసభ్యులు, అధికారులపై కొందరు రాజకీయ నాయకులు ధర్నా చేయకూడదని, కేసులు పెట్టకూడదని ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఘటనపై విచారణ చేపడతామని ఎస్‌ఐ ఫణీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-08-04T22:40:55+05:30 IST