ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-11-27T05:30:00+05:30 IST
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికార యంత్రాంగానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి ఆదే శించారు.
మంత్రి ప్రశాంత్రెడ్డి
కామారెడ్డి, నవంబరు 27 (ఆంధ్ర జ్యో తి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికార యంత్రాంగానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి ఆదే శించారు. శనివారం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ఎమ్మెల్యేలతో టెలికాన్పరెన్స్ ద్వారా సమిక్షించారు. ధాన్యం కొనుగోళ్ల వివరాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. బాన్సువాడలో 94 శాతం, జుక్కల్లో 80 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు. కామారెడ్డి,ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కొనుగోళ్లు వేగవంతం చేయడానికి బాన్సువాడ, జుక్కల్ ప్రాంతాల నుంచి కాంటాలను, హమాలీలను, లారీలను తెప్పించాలని మంత్రి ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలని అన్నారు. తూకం వేసినధాన్యంను వెంటనే రైస్మిల్లులకు తరలించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం స్టాక్ జీరో చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రి చేసి రైతులకు డబ్బులు సకాలంలో అందేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన తూకం, తేమ శాతం చూసే యంత్రాలు, గోనె సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. ఇప్పటికి క్షేత్రస్థాయిలో ఉన్న ధాన్యం నిల్వలు, కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి అధికారులకు తెలియజేసేలా చూడాలన్నారు. ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్షిండే, సురేందర్, అదనపు కలెక్టర్లు వెంకటేష్దోత్రే, వెంకటమాధవరావు, డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి, డీఎస్వో రాజశేఖర్ పాల్గొన్నారు.