ఏపీలో 14 నుంచి ధాన్యం కొనుగోళ్లు
ABN , First Publish Date - 2020-04-04T11:40:00+05:30 IST
ఏపీలో 14 నుంచి ధాన్యం కొనుగోళ్లు
మధ్యాహ్నం ఒంటిగంటవరకు వ్యవసాయ పనులకు అనుమతి
మంత్రుల బృందం నిర్ణయం
అమరావతి(ఆంధ్రజ్యోతి): రైతాంగాన్ని ఆదుకునేందుకు గ్రామాల్లో ఈ నెల 14వ తేదీ నుంచే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని మంత్రుల బృందం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. కరోనా నియంత్రణపై ఆళ్లనాని నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం శుక్రవారం ఇక్కడి ఆర్అండ్బీ భవనంలో సమావేశమై కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, నిత్యావసరాల పంపిణీ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సత్వర వైద్యపరీక్షల నిర్వహణకోసం ర్యాపిడ్ టెస్టింగ్ పరికరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రేషన్ దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఇంటింటికి కూపన్లు ఇవ్వాలని నిర్ణయించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు వ్యవసాయ పనులకోసం అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.