ధాన్యం లారీలపై విచారణ జరిపించాలి

ABN , First Publish Date - 2022-05-17T04:28:30+05:30 IST

కర్నాటక రాష్ట్రం నుంచి తెలంగాణలోకి అక్రమంగా తీసుకువచ్చిన ధాన్యం లారీల కుంభకోణంపై విజిలెన్సు విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య పేర్కొన్నారు.

ధాన్యం లారీలపై విచారణ జరిపించాలి
మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య

మక్తల్‌, మే 16 : కర్నాటక రాష్ట్రం నుంచి తెలంగాణలోకి అక్రమంగా తీసుకువచ్చిన ధాన్యం లారీల కుంభకోణంపై విజిలెన్సు విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య పేర్కొన్నారు. సోమవారం మక్తల్‌ పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న అధికార పార్టీ నాయకులు, పోలీసులు, రెవెన్యూ, ప్రభుత్వ అధికారులు కుమ్మకై కర్నాటక రాష్ట్రంలో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి మక్తల్‌ నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తూ కోట్ల రూపా యలు సంపాదిస్తున్నారన్నారు. పేద రైతులకు దొరకని గన్నీ బ్యాగులు పట్టుబడ్డ నలబై లారీల్లో తెలంగాణ రాష్ర్టానికి సంబంధించిన 40వేల గన్నీ బ్యాగులు ఎవరి ప్రమేయంతో కర్నాటకకు తరలించారో సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ఒకేరోజు 40 లారీలు పట్టుబడితే మక్తల్‌ పోలీస్‌స్టేషన్‌లో 16 లారీలు, కృష్ణ పోలీస్‌స్టేషన్‌లో మూడు లారీలపై కేసులు నమోదు అయ్యాయన్నారు. మిగతా 21లారీలు ఎవరి ఒత్తిడితో అధికారులు వదిలేశారో చెప్పాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు కర్ని స్వామి, దేవరింటి నర్సింహారెడ్డి, కల్లూరి నాగప్ప, బీజేపీ అర్బన్‌ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, బాల్చెడ్‌ మల్లికార్జున్‌, వాకిటి నర్సింహా పాల్గొన్నారు. 

ధన్యాం అక్రమ రవాణాను అరికట్టాలి

కృష్ణ : కర్నాటక రాష్ట్రం నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి వస్తున్న ధాన్యాన్ని అరికట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు జలంధర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నారాయణభట్‌ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు న్యాయం చేసే విధంగా ఉండాలి కానీ, పక్క రాష్ట్రంలోని రాయచూరు, యాదగిరిలో పండించిన ధాన్యం మన రాష్ట్ర సరిహద్దుల ద్వారా నేరుగా మన కొనుగోలు కేంద్రాల్లో చేరుతున్నాయ న్నాయన్నారు. ప్రభుత్వం చెక్‌పోస్టు ఏర్పాటు చేసి పోలీసులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు బందోబస్తు ఉన్నప్పటికీ రాష్ట్రంలోకి ధాన్యం ఎలా వస్తుందని ప్రశ్నించారు. మక్తల్‌ నియోజకవర్గంలో 16 లారీలు చెక్‌పోస్టు దాటి వస్తే అధికారులు ఏం చేస్తున్నారన్నారు. రైతుల పేరుతో అధికార పార్టీ నాయకులు దందాలు నిర్వహిస్తే బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు. పట్టుకున్న ధాన్యం లారీలను సీజ్‌ చేసి కేసు నమోదు చేయాలని, పక్క రాష్ట్రం నుంచి ధాన్యం రాకుండా అడ్డుకోవాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమశేఖర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, నల్లె నర్సప్ప, తాయప్పగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T04:28:30+05:30 IST