షార్జాలో రోడ్డు ప్రమాదం.. భారతీయ బాలుడు మృతి!
ABN , First Publish Date - 2021-06-11T14:43:34+05:30 IST
షార్జాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
యూఏఈ: షార్జాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. షార్జాలోని ఇండియా ఇంటర్నెషనల్ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న బాలుడు రెండు వారాల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు బుధవారం చనిపోయాడు. ఈ విషయాన్ని బాలుడు చదువుతున్న స్కూల్ యాజమాన్యం తన అధికారి ఫేస్బుక్ పేజీ ద్వారా వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షార్జాలోని మువైలేహ్ ప్రాంతంలో నివాసముండే జమీర్ ఖాజీ కుమారుడు అబ్దుల్లా జమీర్ ఖాజీ స్థానికంగా ఉండే ఇండియా ఇంటర్నెషనల్ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు. మే 24న తన ఇంటి సమీపంలోని స్టేషనరీ షాపు వెళ్లిన సమయంలో అబ్దుల్లాను ఓ కారు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స కోసం షార్జా యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. రెండు వారాల పాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందిన అబ్దుల్లా ఆరోగ్యం విషమించడంతో బుధవారం చనిపోయాడు. అబ్దుల్లా మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ స్కూల్ యాజమాన్యం ఫేస్బుక్ పేజీ ద్వారా సంతాపం తెలియజేసింది. స్కూల్ డైరెక్టర్ సల్మాన్ ఇబ్రాహీం, సీనియర్ డైరెక్టర్ అసీఫ్ మహమ్మద్, స్కూల్ ప్రిన్సిపాల్ డా. మంజూ రెజీలతో పాటు స్కూల్ టీచర్లు, విద్యార్థులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం షార్జాలో అబ్దుల్లా అంత్యక్రియలు నిర్వహించారు.