హైదరాబాద్: తెలంగాణ ప్రజలు, రైతుల్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మరోసారి అవమానించారని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్రావు అన్నారు. తెలంగాణను అవమానించే హక్కు పీయూష్ గోయల్కు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయమాటలతో రైతుల్ని కేంద్రం మభ్యపెడుతోందని ఆయన ఆరోపించారు. రైతుల్ని మేం కాదు.. మీరే మోసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశానికి తెలంగాణ నుంచే అవసరమైన 60 శాతం విత్తనాలు సరఫరా అవుతున్నాయన్నారు. పంజాబ్ బియ్యానికి, తెలంగాణ బియ్యానికి తేడా లేదా అని ఆయన నిలదీశారు.
కేంద్ర మంత్రి పియుష్ గోయల్ మరోసారి అవమాన పర్చేలా వ్యాఖ్యలు చేయటాన్ని మంత్రి హరీష్ రావు ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పీయుష్ గోయల్కు అహంకారం ఎక్కువైందన్నారు. తెలంగాణ రాక ముందు రైతుల ఆత్మ హత్యలు ఉండేవని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు అనేక పథకాలు తీసుకు వచ్చామని ఆయన తెలిపారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందన్నారు. దేశంలో 80 శాతం సీడ్ను తెలంగాణలో తయారు చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇది సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు. పంటల సాగును ఇతర రాష్ట్రాలతో పోల్చటం సరికాదన్నారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ తెలంగాణలో ఉండదా అని ఆయన ప్రశ్నించారు. ఈడీ, ఐటీ దాడులు చేస్తామని బెదిరించే సంస్కృతి బీజేపీదని ఆయన మండిపడ్డారు.
అవసరం అయితే తాము నూకలు తింటామని, మిమ్మల్ని గద్దె దించేవరకు ఉద్యమిస్తామన్నారు. పీయూష్ గోయల్ పదేపదే తెలంగాణ ప్రజలను, రైతులనుఅవమాన పరుస్తున్నారన్నారు. 700 మంది రైతుల చావుకు కారణం బీజేపీ ప్రభుత్వం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే అన్ని ధరలు పెంచారని ఆయన ఆరోపించారు. నూకలు తినలాని అవమానపరుస్తుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించరా అని ఆయన నిలదీశారు. మీకు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం ముఖ్యమా...పదవులు ముఖ్యమా అని ఆయన కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. మీరు రైతుల పక్షమా...కార్పొరేట్ల పక్షమో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పీయూష్ గోయల్ వ్యాఖ్యలు కార్పొరేట్లకు వత్తాసు పలికేలా ఉన్నాయన్నారు. గోయల్ చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చిరించారు. అహంకారంగా వ్యవహరించిన ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్ కుమార్ ఏమయిపోయాడో అందరికీ తెలుసని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి