మార్కెట్ యార్డుకు వచ్చిన పసుపు
ABN , First Publish Date - 2020-05-27T07:35:11+05:30 IST
రెండు నెలల విరామం అనంతరం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు కొనుగోళ్లు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేసీఆర్ ఆదేశంతో మార్కెట్ను...
- నేటి నుంచి పసుపు కొనుగోళ్లు
- రాష్ట్రంలోని పంటకే అనుమతి
- నిజామాబాద్ మార్కెట్లో ఏర్పాట్లు
నిజామాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రెండు నెలల విరామం అనంతరం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు కొనుగోళ్లు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేసీఆర్ ఆదేశంతో మార్కెట్ను తిరిగి తెరుస్తున్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో పండించిన పంటను మాత్రమే కొనుగోలు చేయనున్నారు. మహారాష్ట్రతో పాటు ఏపీ రైతులను మార్కెట్లోకి అనుమతించడం లేదు. కరోనా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రోజుకు 10వేల బస్తాలను మాత్రమే మార్కెట్లోకి అనుమతించనున్నారు. మరోవైపు.. మంగళవారం సాయంత్రమే రైతులు పసుపును మార్కెట్కు తీసుకొచ్చారు.
మార్కెట్ అధికారులు టోకెన్లను ఇచ్చి అనుమతించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు పంటను మార్కెట్కు తీసుకొచ్చేందుకు అనుమతిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా పసుపు కొనుగోళ్లు నిలిచిపోవడం వల్ల ప్రస్తుతం ధర వస్తుందా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ లేని సమయంలో క్వింటాలు రూ.4500- 5500లకు అమ్మకాలు జరిపారు. కాని, ప్రస్తుతం పసుపు దిగుబడి బాగా రావడంతో అంతకు మించి ధర రావాలని రైతులు ఆశిస్తున్నారు. అధికారులు మాత్రం క్వింటాలుకు రూ. 4500 నుంచి ధర వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.