‘అనంత’ ఉద్యాన పంటల రైతులను ఆదుకోండి: కేశవ్
ABN , First Publish Date - 2020-03-29T08:43:19+05:30 IST
కరోనా కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో కరువు జిల్లా అనంతపురం ఉద్యానపంటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉరవకొండ...
అనంతపురం వైద్యం, మార్చి 28: కరోనా కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో కరువు జిల్లా అనంతపురం ఉద్యానపంటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉరవకొండ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల కష్టనష్టాలను తీర్చాలని కోరుతూ శనివారం ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ సందర్భంగా కేశవ్ విలేకరులతో మాట్లాడుతూ... లాక్డౌన్ నిబంధనలతో ఆరుగాలం కష్టపడి పండించిన అరటి, ఇతర ఉద్యాన పంటలు చేతికి అందక అనంత జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. నిత్యావసరాల రవాణా పంపిణీకి ఎక్కడా ఎలాంటి ఆటంకం కలిగించొద్దని మూడ్రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చారన్నారు. అయినా నిత్యావసర కూరగాయలు, పండ్లు రవాణాకు కర్ఫ్యూతో ఇంకా ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. రవాణా సౌకర్యాలు లేక కొనుగోలుదారులు ముందుకు రావడం లేదన్నారు. దీనివల్ల ఇటు రైతులకు అటు వినియోగదారులకు ఉపయోగం లేకుండా పోతున్నాయన్నారు.