ప్రభుత్వ పాఠశాలలో న్యాయమూర్తి కుమారుడు
ABN , First Publish Date - 2022-06-17T15:47:41+05:30 IST
కుమారుడిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన జిల్లా న్యాయమూర్తిని పలువురు అభినందిస్తున్నారు. తిరుప్పూర్ జిల్లా అవినాశి జిల్లా జడ్జి శక్తివేల్కు పునీత అనే భార్య, రీమాశక్తి అనే
ప్యారీస్(చెన్నై), జూన్ 16: కుమారుడిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన జిల్లా న్యాయమూర్తిని పలువురు అభినందిస్తున్నారు. తిరుప్పూర్ జిల్లా అవినాశి జిల్లా జడ్జి శక్తివేల్కు పునీత అనే భార్య, రీమాశక్తి అనే కుమార్తె, నిషాంత్ శక్తి అనే కుమారుడున్నాడు. కుమారుడు, కుమార్తెను ప్రారంభం నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే ఆయన చదివిస్తున్నారు. ఈరోడ్ కుమలన్కుట్టలోని ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో కుమార్తె 10వ తరగతి పరీక్షలు రాయగా, అదే పాఠశాలలో కుమారుడు 8వ తరగతి పూర్తిచేశాడు. ఈ క్రమంలో, ఇటీవల ఈరోడ్ నుంచి అవినాశికి న్యాయమూర్తి బదిలీ అయ్యారు. దీంతో, ఆయన తన కుమారుడు నిషాంత్ శక్తిని ప్రభుత్వ బాలుర మహోన్నత పాఠశాలలో 9వ తరగతిలో చేర్పించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శక్తివేల్ మాట్లాడుతూ, తాను చిన్నతనం నుంచే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని, లా పూర్తి చేసి ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేసానన్నారు. టీఎన్పీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి జడ్జిగా పనిచేస్తున్నాని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న 60 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారని, వారు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే, పాఠశాలలు అభివృద్ధి చెందడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని జడ్జి శక్తివేల్ అభిప్రాయపడ్డారు.