ఆవుపేడతో ప్రకృతిసిద్ధమైన పెయింట్.. ఆవిష్కరించిన కేంద్రం..
ABN , First Publish Date - 2021-01-13T05:16:28+05:30 IST
ఆవుపేడతో ప్రకృతిసిద్ధమైన పెయింట్.. ఆవిష్కరించిన కేంద్రం..
న్యూఢిల్లీ: ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) ఇవాళ విష పదార్థాల్లేని పర్యావరణ అనుకూల (ఎకో ఫ్రెండ్లీ) పెయింట్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఖాదీ ప్రాకృతిక్ పెయింట్' పేరుతో కేంద్ర రోడ్డు రవాణా, హైవేలు, ఎంఎస్ఎంఈ మంత్రి నితిన్ గడ్కరీ ఈ వినూత్న పెయింట్ను ఆవిష్కరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఈ పెయింట్ ఎంతగానో ఉపకరిస్తుందని గడ్కరీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆవు పేడతో దేశంలో తొలిసారి రూపొందించిన ప్రాకృతిక్ పెయింట్కు యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఆవు పేడతో తయారైనా ఈ పెయింట్కు ఎలాంటి వాసన ఉండకపోవడం మరో విశేషం. అత్యంత తక్కువ ధరకే అందించనున్న పాకృతిక్ పెయింట్ను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) కూడా సర్టిఫై చేసింది. డిస్టెంపర్, ప్లాస్టిక్ ఎమల్షన్ రూపాల్లో లభించే ఖాదీ ప్రాకృతిక్ పెయింట్లో సీసం, పాదరసం, క్రోమియం, ఆర్సెనిక్, కాడ్మియం లాంటి భార లోహాలేమీ ఉండవని కేవీఐసీ ఇప్పటికే ప్రకటించింది. లీటర్ డిస్టెంపర్ ధర రూ. 120, ఎమల్షన్ ధర రూ. 225గా నిర్ణయించారు. బడా పెయింట్ కంపెనీలు విక్రయించే పెయింట్ల ధరకంటే పాకృతిక్ పెయింట్ ధర సగానికి సగం తక్కువగా ఉండడం మరో విశేషం.