ప్రభుత్వ ఉద్యోగులకు 3 డీఏలు

ABN , First Publish Date - 2022-01-20T07:05:40+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మూడు డీఏలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మూడు డీఏలను మొత్తం 10.01 శాతంగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన...

ప్రభుత్వ ఉద్యోగులకు 3 డీఏలు

10.01%  విడుదల చేస్తూ ఉత్తర్వులు

జనవరి నెల వేతనాలతో చెల్లింపు

జూలై నుంచి బకాయిలు జీపీఎఫ్‌ ఖాతాలకు


హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మూడు డీఏలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మూడు డీఏలను మొత్తం 10.01 శాతంగా  ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 1.1.2020, 1.7.2020, 1.1.2021, 1.7.2021లకు సంబంధించి  డీఏలు రావాల్సి ఉంటుంది.  సోమవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఉద్యోగుల మొదటి మూడు డీఏలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అంటే 1.1.2021కు సంబంధించి 3.60 శాతం, 1.7.2020కు సంబంధించి 2.73 శాతం, 1.1.2021కు సంబంధించి 3.64 శాతం డీఏలకు ఆమోదం లభించింది. ఈ మూడు డీఏల మొత్తం 10.01 శాతం ప్రకటిస్తూ తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పెరిగిన డీఏల మొత్తాన్ని జనవరి నెల వేతనాలతో కలిపి ఫిబ్రవరి 1న చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2021 సంవత్సరం జూలై 1 నుంచి 2021 సంవత్సరం డిసెంబరు వరకు గల ఆరు నెలల డీఏల బకాయిలను ఉద్యోగుల జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(జీపీఎ్‌ఫ)కు బదిలీ చేస్తామని తెలిపింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ కింద ఉన్న ఉద్యోగులకు ఈ బకాయిల్లో 10 శాతం డబ్బును వారి పర్మినెంట్‌ రిటైర్మెంట్‌ అకౌంట్‌ నెంబర్‌(ప్రాన్‌) ఖాతాల్లో జమ చేస్తామని, మిగతా 90 శాతం సొమ్మును మూడు వాయిదాల్లో ఈ జూన్‌ నెల నుంచి చెల్లిస్తామని తెలిపింది. ఈ డీఏలు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్లు, జిల్లా గ్రంధాలయ సంస్థలు, వర్క్‌ ఛార్జ్‌డ్‌ సంస్థల సిబ్బంది, ఎయిడెడ్‌ విద్యాసంస్థలు, ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌లలోని బోధన, బోధనేతర సిబ్బంది అందరికీ వర్తిస్తాయని స్పష్టం చేసింది. కాగా పార్ట్‌ టైమ్‌ అసిస్టెంట్లు, విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్ల(వీఆర్‌ఏ)కు నెలకు అదనంగా రూ. 100 చొప్పున పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో ప్రకటించింది. ఈ ఏప్రిల్‌లోపు రిటైర్‌ అయ్యే ఉద్యోగులకు మాత్రం డీఏలను నగదు రూపంలో చెల్లించనుంది.

Updated Date - 2022-01-20T07:05:40+05:30 IST