శారదా పీఠం ఆక్రమణకు ‘ఆమోదం’

ABN , First Publish Date - 2020-06-05T09:34:47+05:30 IST

తిరుమలలో మౌనస్వామి మఠం, విశాఖ శారదా పీఠం కేటాయింపులకు మించి ఆక్రమించుకున్న భూములను క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు హిందూ మఠాలకు తిరుమలలో

శారదా పీఠం ఆక్రమణకు ‘ఆమోదం’

  • తిరుమలలో 4,817 చ.అ.ల భూమి క్రమబద్ధీకరణ
  • చ.అ.కు రూ.964 చొప్పున లీజు నిర్ణయించిన టీటీడీ
  • మౌనస్వామి మఠానికి కూడా ఇలాగే.. టీటీడీ బోర్డు నిర్ణయాలకు సర్కారు ఓకే
  • అడుగు దొరకడమే కొండపై అసాధ్యం


తిరుపతి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో మౌనస్వామి మఠం, విశాఖ శారదా పీఠం కేటాయింపులకు మించి ఆక్రమించుకున్న భూములను క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు హిందూ మఠాలకు తిరుమలలో టీటీడీ లీజు ప్రాతిపదికన స్థలాలను కేటాయించింది. ఈ క్రమంలో మౌన స్వామి మఠానికి, విశాఖ శారదా పీఠానికి కూడా భూములు కేటాయించారు. అక్కడ సంబంధిత మఠాలు భారీ భవంతులు నిర్మించుకున్నాయి. మౌనస్వామి మఠం నిర్వాహకులు 1,870 చదరపు అడుగులు, విశాఖ శారదా పీఠం నిర్వాహకులు 4,817 చదరపు అడుగులు చొప్పున అదనంగా ఆక్రమించారు. గత డిసెంబరు 28వ తేదీన తిరుమలలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. మౌన స్వామి మఠం ఆక్రమించిన భూమికి చదరపు అడుగు రూ. 374 వంతున, విశాఖ శారదా పీఠం ఆక్రమించిన భూమికి చదరపు అడుగు రూ.964 వంతున లీజు నిర్ణయిస్తూ క్రమబద్ధీకరించాలని పాలకమండలి (తీర్మానం నంబరు 249)  నిర్ణయించింది. ఈ విషయాన్ని టీటీడీఈవో గత జనవరి 21న లేఖ ద్వారా రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్రప్రభుత్వం అనుమతినిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.  తిరుమలలో చదరపు అడు గు స్థలం దక్కించుకోవడమూ కష్ట మే. అలాంటిది నామమాత్రపు రుసుముతో తిరుమలలో స్థలాలు పొందుతున్న మఠాలు... కేటాయించినదానికి అదనంగా భూములను ఆక్రమించడం, వాటికి టీటీడీ క్రమబద్ధీకరణ పేరిట ఆమోదముద్ర వేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర పాలకులకు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సన్నిహితునిగా పేరుపడిన సంగతి తెలిసిందే!

Updated Date - 2020-06-05T09:34:47+05:30 IST