దేశ సుస్థిరాభివృద్ధికి పరిశోధనలే ప్రధానం
ABN , First Publish Date - 2021-08-06T09:05:56+05:30 IST
దేశాన్ని స్వయం సమృద్ధి సాధించే దిశగా శాస్త్రవేత్తలు ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు.
సీఎ్సఐఆర్ - ఐఐసీటీ వ్యవస్థాపక దినోత్సవంలో గవర్నర్
హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): దేశాన్ని స్వయం సమృద్ధి సాధించే దిశగా శాస్త్రవేత్తలు ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ 78వ వ్యవస్థాపక దినోత్సవం గురువారం జరిగింది. ఈ సందర్భంగా పాండిచ్చేరి నుంచి ఆన్లైన్లో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ లక్ష్యాన్ని సాధించడంలో సైన్స్ అండ్ టెక్నాలజీదే కీలక పాత్ర అని తెలిపారు. దేశ ప్రగతి, సంపద, సుస్థిర అభివృద్ధికి పరిశోధనలు, అన్వేషణలే ప్రధానమని చెప్పారు. పేటెంట్ హక్కుల కోసం దేశం నుంచి ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వెళ్లేలా చూడాలని ఆమె శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. మేధో సంపన్న ఆర్థిక వ్యవస్థగా, జ్ఞానవంతమైన దేశంగా ఎదగాలంటే వివిధ అంశాల్లో పరిశోధనలు కొనసాగాలన్నారు. ఫార్మా ముడిసరుకులకు విదేశాలపై ఆధారపడాల్సి వస్తుందని, ఈ విషయంలో స్వయం సమృద్ధి సాధించడానికి కృషి చేయాలని సూచించారు.