తిరుమలేశుడి సేవలో తెలంగాణ గవర్నర్
ABN , First Publish Date - 2022-01-17T07:10:17+05:30 IST
తిరుమల శ్రీవారిని ఆదివారం తెలంగాణ గవర్నర్ తమిళసై దర్శించుకున్నారు.
తిరుమల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని ఆదివారం తెలంగాణ గవర్నర్ తమిళసై దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లిన ఆమె ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వార ప్రవేశ అనంతరం రంగనాయక మండపానికి చేరుకున్న గవర్నర్కు వేదపండితులు ఆశీర్వచనం చేయగా, టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు, నూతన ఏడాది డైరీ, క్యాలెండర్లు అందజేశారు. కాగా, దర్శనం తర్వాత తమిళసై ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ బాగుండాలని, కరోనా నుంచి బయటపడాలని శ్రీవారిని కోరుకున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.