మిర్చి రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి
ABN , First Publish Date - 2022-01-20T05:51:10+05:30 IST
నల్ల తామర పురుగు వల్ల నష్టపోయిన మిర్చి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పటాపంచల జమలయ్య అన్నారు.
కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య
గంపలగూడెం : నల్ల తామర పురుగు వల్ల నష్టపోయిన మిర్చి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పటాపంచల జమలయ్య అన్నారు. నష్టపోయిన మిర్చి రైతులకు నష్ట పరిహారంతో పాటు పంటల బీమా వర్తింప చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆంధ్ర ప్రదేశ్ కౌలు రైతు సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా, వంటా వార్పు చేసినా అధికారుల్లో స్పందన లేకపోవడంతో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ ఎకరానికి రూ. లక్ష, కౌలు రైతులకు రూ.1.50 లక్షలు ఇవ్వాలన్నారు. ఈ-క్రాప్ నమోదు కాని వారికి వెంటనే నమోదు చేయాలన్నారు. అనంతరం ఏవో సాయిశ్రీ రాస్తారోకో చేస్తున్న రైతుల వద్దకు వచ్చి ఈ-క్రాప్ నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని తహసీల్దార్ జి.బాలకృష్ణారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో గుంటుపల్లి వీరభద్రం, ఎం.వెంకటరెడ్డి, జె.వెంకటేశ్వరరావు, ఎం.కుటుంబరావు, ఎం.గోపాలకృష్ణ, డి.నాగేశ్వరరావు, ఎన్.సత్యంబాబు, బండి వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.