ప్రభుత్వాలు నిరంకుశ వైఖరి విడనాడాలి
ABN , First Publish Date - 2022-08-15T04:38:41+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ వైఖరిని విడనాడాలని, వీరి వైఖరిపై దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే షాజహాన్బాషా తెలిపారు.
పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్
కురబలకోట, ఆగస్టు 14 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ వైఖరిని విడనాడాలని, వీరి వైఖరిపై దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే షాజహాన్బాషా తెలిపారు. ఆజాదీ కా గౌరవయాత్రలో భాగంగా ఆదివారం కురబలకోట మండలం ముదివేడు నుంచి గుర్రంకొండ వరకు నిరసన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తూ అంబానీ, ఆదానీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను పాతాళానికి తొక్కుతూ పారిశ్రామికవేత్తలను అందలానికి ఎక్కిస్తోందన్నారు. కేసుల నుంచి ఉపశమనం పొందడానికి సీఎం జగన్ కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారారన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి నాగూర్వలీ, రెడ్డిబాషా, షంషీర్, నజీర్, జబీబుల్లా, ఇంతియాజ్. గిరీష్, శంర్నాయుడు, వేమయ్య, శ్రీనివాసులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.