రాత్రికి రాత్రే కబ్జా
ABN , First Publish Date - 2022-01-24T05:51:54+05:30 IST
మండలంలో కొంతమంది ఆక్రమణదారులు చెలరేగిపోతున్నారు. రానున్న కాలంలో ప్రభుత్వానికి చెందిన చెరువులు కుంటలు, కాలువలు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే... గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామ పంచాయతీ నడిబొడ్డున వున్న ప్రభుత్వ భూమి రాత్రికి రాత్రే కబ్జాకు గురైంది.
గోకవరం, జనవరి 23: మండలంలో కొంతమంది ఆక్రమణదారులు చెలరేగిపోతున్నారు. రానున్న కాలంలో ప్రభుత్వానికి చెందిన చెరువులు కుంటలు, కాలువలు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే... గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామ పంచాయతీ నడిబొడ్డున వున్న ప్రభుత్వ భూమి రాత్రికి రాత్రే కబ్జాకు గురైంది. ఉదయం లేచి చూడగానే ప్రభుత్వ భూమి గ్రావెల్, మట్టితో నిండి ఆక్రమణకు గురైంది. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. దీనిపై స్థానిక రెవెన్యూ అధికారిని, గ్రామ పంచాయతీ కార్యదర్శిని గ్రామస్తులు వివరణ కోరగా తమకు ఎటువంటి సమాచారం లేదని, దీనిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కృష్ణునిపాలెం రెవె న్యూ రికార్డును గ్రామ పెద్దలు పరిశీలించగా బ్రిటీష్కాలం నాటి నుంచి కూడా రిజిస్టర్లో సర్వే నెం.178లో ప్రభుత్వ భూమిగా పక్కా ఆధారాలతో ఉందని గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు తెలిపారు. గత కొంతకాలంగా ఈ భూమిని కృష్ణునిపాలెం పంచాయతీ నిర్వాహకులు డంపింగ్ యార్డుగా ఉపయోగించుకుంటున్నారు. ఆక్రమణదారులు అడ్డగోలుగా డంపింగ్ యార్డుపై మట్టి పోసి ఫిల్లింగ్ చేశారు. ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించుకుంటే అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.