పేదల కోసం ప్రభుత్వం ఒక్క ఇల్లూ కట్టకపోవడం బాధాకరం: కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2022-01-31T00:57:04+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా పేదల కోసం ప్రభుత్వం ఒక్క ఇల్లూ కట్టకపోవడం బాధాకరమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు.

పేదల కోసం ప్రభుత్వం ఒక్క ఇల్లూ కట్టకపోవడం బాధాకరం: కోమటిరెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా పేదల కోసం ప్రభుత్వం ఒక్క ఇల్లూ కట్టకపోవడం బాధాకరమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సొంతింటి కల నెరవేరినప్పుడే పేదలు కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోతారని తెలిపారు. కేవలం సిరిసిల్ల, గజ్వేల్‌, పాలకుర్తి నియోజకవర్గాల్లోనే డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యాయే.. తప్ప మరే నియోజకవర్గంలోనూ ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని ఆరోపించారు. దళితులంటేనే పేదవారని, ప్రతి నియోజకవర్గంలో దాదాపు 15వేల కుటుంబాలు ఉంటాయని, వాళ్లలో 100మందిని ఎంపిక చేయడం కత్తి సాములాంటిదేనని అన్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసే ఎమ్మెల్యేలు అభాసుపాలు కాకతప్పదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు. 

Updated Date - 2022-01-31T00:57:04+05:30 IST