ప్రభుత్వ సేవలు పెండింగ్ ఉండరాదు : కలెక్టర్
ABN , First Publish Date - 2022-01-25T05:21:10+05:30 IST
ప్రభుత్వ సేవలు పెండింగ్ లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వి.విజయరామరాజు క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జేసీలు గౌతమి, సాయికాంత వర్మ, ధ్యానచంద్ర, డీఆర్వో మలోలతో కలసి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
కడప(కలెక్టరేట్), జనవరి 24: ప్రభుత్వ సేవలు పెండింగ్ లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వి.విజయరామరాజు క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జేసీలు గౌతమి, సాయికాంత వర్మ, ధ్యానచంద్ర, డీఆర్వో మలోలతో కలసి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు లక్ష్యసాధన కోసం దృష్టి సారించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో తహశీల్దారు కార్యాలయాల్లో వచ్చే సర్వీసు రిక్వెస్టులను పెండింగ్ లేకుండా చేయాలన్నారు. కొవిడ్ మూడవ దశ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని, కొవిడ్ పాజిటివ్ రేట్ను తగ్గించే విధంగా రెవెన్యూ డివిజన్ల వారీగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని అన్నారు.
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలి
ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని కలెక్టర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. ‘ఆకాంక్ష జిల్లాల ఆశయసాధన’లో భాగంగా జిల్లా కార్యాచరణ, ప్రగతిపై సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స హాలులో సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ 2018లో నీతి అయోగ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కొన్ని ఆకాంక్ష జిల్లాలను ఎంపిక చేసిందన్నారు. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ జిల్లాను ఎంపిక చేసిందన్నారు. అందులో భాగంగా జిల్లాలో సామాజిక స్థాయిని ‘ఉన్న స్థితి నుంచి ఉన్నతి స్థితి’కి తీసుకు రావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. విద్య, వైద్యం, నైపుణ్యాబివృద్ధి, గృహాలు, వ్యవసాయం, పశుపోషణ, మౌలిక సదుపాయాలకు సంబంధించి సంబంధి శాఖలు లక్ష్యాలను చేరుకోవడానికి సమన్వయంతో సాగాలన్నారు.