గ్రామీణుల చెంతకే ప్రభుత్వ పాలన: మహీధర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-08-04T06:25:56+05:30 IST

గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు పరిపాలనను మరింత దగ్గరకు చేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి పేర్కొన్నారు.

గ్రామీణుల చెంతకే ప్రభుత్వ పాలన: మహీధర్‌రెడ్డి
సచివాలయం ప్రారంభిస్తున్న మహీధర్‌రెడ్డి

లింగసముద్రం, ఆగస్టు 3 : గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు పరిపాలనను మరింత దగ్గరకు చేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మండలంలోని యర్రారెడ్డిపాలెంలో రూ.40 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ సచివాయలం భవనాన్ని ప్రారంభంచారు. అనంతరం అదే గ్రామంలో రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. తర్వాత వాకమళ్ళవారిపలెంలో రూ.40 లక్షలతో నిర్మించిన లింగసముద్రం -2 సచివాలయాన్ని, రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, అలాగే మొగిలిచెర్లలో రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయాన్ని, రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, నారసింహాపురంలో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, పెంట్రాలలో రూ.25 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని, రూ.19.50 లక్షలతో నిర్మించిన యూపీ పాఠశాల ప్రహారి గోడను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలలో ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లోని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టారన్నారు. గ్రామాలలోని ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందించేందుకు రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, పాల శీతలీకరణ భవనాలు నిర్మిస్తున్నారని చెప్పారు. జిల్లాలో కందుకూరు నియోజక వర్గంలో 65 శాతం భవనాలు పూర్తి కావస్తుండడంతో జిల్లా కలెక్టర్‌ అభినందించినట్టు చెప్పారు.

త్వరలో నూతన రోడ్లకు టెండర్లు

త్వరలో శింగరాయకొండ నుంచి మాలకొండ వరకు రూ.370 కోట్లతో హైవేగా మూడు లైన్ల రోడ్డు నిర్మాణానికి, వలేటివారిపాలెం నుంచి లింగసముద్రం వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణానికి, తిమ్మారెడ్డిపాలెం నుంచి యర్రారెడ్డిపాలెం మీదుగా వలేటివారిపాలెం మండలంలోని అయ్యవారిపాలెం వరకు రూ.6.7 కోట్లతో తారు రోడ్ల నిర్మాణాలకు టెండర్లు జరుగుతాయని చెప్పారు.

 సోమశిల జలాలు రాళ్లపాడుకు రానున్నట్టు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి చెప్పారు.సోమశిల జలాశయం పూర్తిగా నిండే అవకాశం ఉన్నందున రాళ్ళపాడుకు నీరు రప్పిస్తామన్నారు.అలాగే రాళ్ళపాడుకు త్వరగా నీరు వచ్చేందుకు రూ.840 కోట్లతో కాలువ వెడల్పు చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. కార్యక్రమంలో పీఆర్‌ ఈఈ సుబ్రహ్మణ్యం, డీఈ సాధిక్‌, తహసిల్దార్‌ బ్రహ్మయ్య, యంపీడీఓ కె శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకులు  పి తిరుపతిరెడ్డి, వి కృష్ణారెడ్డి, సర్పంచులు పులి పెద రాఘవులు, డి మల్లిఖార్జున, బత్తిన మధుసూదనరావు, పల్లాల మాలకొండారెడ్డి, కనకం వెంకటేశ్వర్లు, వెన్నపూస కొండారెడ్డి, సూరం కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-04T06:25:56+05:30 IST