రైస్మిల్లులో ప్రభుత్వ బియ్యం సరఫరా వాహనం
ABN , First Publish Date - 2021-07-27T04:48:52+05:30 IST
మండల కేంద్రంలోని కడప-మదనపల్లె జాతీయ రహదారి పక్కన గల ప్రైవేటు రైస్మిల్లు వద్ద సోమవారం ప్రభుత్వ బియ్యం పంపిణీ చేసే వాహనం దర్శనమిచ్చింది.
చిన్నమండెం, జూలై 26: మండల కేంద్రంలోని కడప-మదనపల్లె జాతీయ రహదారి పక్కన గల ప్రైవేటు రైస్మిల్లు వద్ద సోమవారం ప్రభుత్వ బియ్యం పంపిణీ చేసే వాహనం దర్శనమిచ్చింది. ప్రభుత్వం ఇంటింటికి నాణ్యమైన బియ్యం కోసం కేటాయించిన వాహనాలను సొంత పనులకు వాడు కుంటున్నారనే విమర్శలున్నాయి. రైస్మిల్లు వద్ద వాహనం ఎందుకుంది. ప్రభుత్వ రైస్ అమ్ముతున్నారా అంటూ ‘ఆంధ్రజ్యోతి’ నిలదీయడంతో కలిబండ రేషన్షాపుకు సంబంధించిన వాహనం అని, మా సొంత వడ్లను మిల్లులో ఆడించేందుకు తీసుకువచ్చామంటూ సమాధానం ఇచ్చారు. వాహనానికి కనీసం నెంబరు కూడా లేకపోవడం విశేషం. అదే విషయమై తహసీల్దార్ నాగేశ్వర్రావును వివరణ కోరగా రేషన్ పంపిణీ సమయంలో తప్ప మిగతా సమయాల్లో వాహనాలు వారి ఆధీనంలో ఉంటాయన్నారు. వారిని పిలిపించి ఎందుకు వచ్చారో విచారిస్తామన్నారు.