బకాయిల్‌ షాక్‌..!

ABN , First Publish Date - 2021-11-27T05:24:12+05:30 IST

జిల్లాలో పోలీసు, రెవెన్యూ, విద్య, వైద్యంతో పాటు మిగిలిన శాఖలన్నీ నెలల తరబడి విద్యుత్‌ బిల్లులు చెల్లించడం లేదు. ఇలా మొత్తం శాఖలన్నీ కలిపి ట్రాన్స్‌కోకు పడిన బకాయి అక్షరాలా రూ.1,100 కోట్లకు పైమాటే.

బకాయిల్‌ షాక్‌..!

ట్రాన్స్‌కోకు ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన 

బిల్లులు రూ.1,600 కోట్లకు పైమాటే

జాబితాలో పోలీసు, రెవెన్యూ శాఖలు 

నోరెత్తని ఈపీడీసీఎల్‌.. సామాన్యుడైతే రాత్రికి రాత్రే పవర్‌ కట్‌


జిల్లాలో పోలీసు, రెవెన్యూ, విద్య, వైద్యంతో పాటు మిగిలిన శాఖలన్నీ నెలల తరబడి విద్యుత్‌ బిల్లులు చెల్లించడం లేదు. ఇలా మొత్తం శాఖలన్నీ కలిపి ట్రాన్స్‌కోకు పడిన బకాయి అక్షరాలా రూ.1,100 కోట్లకు పైమాటే. కొన్ని శాఖల్లో విద్యుత్‌ బిల్లులు చెల్లించక ఏళ్లు దాటాయి. ఏడాదిన్నర క్రితం ఈ బకాయిలు రూ.600 కోట్లు ఉంటే.. ఇప్పుడది రెట్టింపు అయ్యింది. అదే సామాన్యులు బిల్లు కట్టకపోతే అధికారులు ఏం చేస్తారో తెలిసిందేగా..! మరి వీటికి..?


(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. బిల్లులు చెల్లించలేక, వచ్చే ఆదాయం రాబ ట్టలేక ఇప్పటికే చతికిలపడింది. బిల్లులన్నీ ట్రెజరీలకు పంపి నప్పటికీ మిగిలిన బిల్లుల మాదిరిగానే విద్యుత్‌ బిల్లు బకాయి లను మంజూరు చేయకపోగా అసలు వాటిని పట్టించుకోవ డమే లేదని వివిధ శాఖల బాధ్యులు నెత్తీ నోరు బాదుకుంటు న్నారు. జిల్లావ్యాప్తంగా ట్రాన్స్‌కోకు ప్రభుత్వశాఖల పరంగా రూ.1,100 కోట్ల మేర బకాయిలు ఉండగా వీటిలో లోటెన్షన్‌ విభాగంలో రూ.521 కోట్లు, హైటెన్షన్‌ విభాగంలో రూ.664 కోట్లు బకాయిపడ్డాయి. కలెక్టరేట్‌ దగ్గర నుంచి మునిసిపల్‌ ఆఫీసు వరకు ఇందులో ఉన్నాయి. పోలీసుశాఖ గడిచిన ఎనిమిది నెలల కాలంలో దాదాపు రూ.87 లక్షలకు పైగానే బకాయి పడింది. రెవెన్యూ పరిధిలో ఈ బకాయిలకు కొదవేలేదు. ఇదిగో కడతాం.. అదిగో కడతామంటూ వరుసగా కాలయాపన చేస్తూనే వచ్చారు. ట్రాన్స్‌కోకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోని కారణంగా కీలక విభాగాల జిల్లా కార్యాలయాలతోపాటు మండల కార్యాలయాలు ఇప్పటికే బకాయిలు తడిసి మోపెడవుతు న్నాయి. ఒక్క పంచాయతీరాజ్‌ విభాగంలోనే రూ.407 కోట్లు చెల్లించాల్సి ఉంది. ట్రాన్స్‌కో ఎంత మొత్తుకున్నా, ఎన్నిసార్లు గుర్తుచేసినా ఆ శాఖ కిమ్మనకుండా ఉంది. ఆ తదుపరి గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యుఎస్‌) భారీగానే బకాయిపడింది. ఇప్పటికే రూ.43 కోట్లకుపైగానే పెండింగ్‌లోనే ఉంది.  వందల గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాల్సి ఉన్నందున భారీగానే విద్యుత్‌ వాడకం ఉంటుంది. అన్నింటితోపాటే విద్యాశాఖ బకాయిలు భారీగానే పెరిగాయి. ఇంతకుముందు ఎక్కడికక్కడ ఆయా పాఠశాలల విద్యుత్‌ వినియోగానికిగాను బిల్లు బకాయి పడకుండా జాగ్ర త్త పడేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా శాఖ పరిధిలో విద్యుత్‌ బకాయిలు మోతెక్కుతున్నాయి. ఇక మునిసిపాలిటీల విషయానికొస్తే చెప్పాల్సిన అవసరమే లేదు. సాధారణంగా పంచాయతీ విభాగాల్లో వీధిలైట్ల నిర్వహణకు బిల్లులు భారీగా చెల్లించేవారు. రానురాను పట్టణ ప్రాంతాల్లో ప్రధాన మార్గాలతో పాటు మారుమూల సందుల్లోను వీధి లైట్లు పెద్ద సంఖ్యలోనే పెరిగాయి. వీటి అవసరానికి తోడు పన్ను వసూళ్లు పెరిగాయి. అయినప్పటికీ ట్రాన్స్‌కోకు చెల్లించాల్సిన బకాయిలపై నోటిమాటకైనా ఎత్తితే ఒట్టు.  ఇప్పటికే మునిసిపాలిటీలు ఏడు కోట్ల వరకు బకాయిలు పడ్డాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు మూడో గ్రేడు మునిసిపాలిటీలన్నీ ముప్పుతిప్పలు పడుతున్నాయి. ఏలూరు కార్పొరేషన్‌లోనూ విద్యుత్‌ వినియోగం సాధారణ స్థాయికంటే మించి భారీగా పెరిగినట్టయింది. దీనికి తగ్గట్టుగానే విద్యుత్‌ బిల్లులు తడిసి మోపెడయ్యాయి. 


అడిగితే ఒట్టు..

ప్రభుత్వ శాఖలు బిల్లుల చెల్లించకపోయినా ట్రాన్స్‌కో అడిగితే ఒట్టు. అదే సామాన్యుడు ఇంటి బిల్లు ఒక్క వారం ఆలస్యమైతే వెంటనే పవర్‌ కట్‌ చేస్తారు. ప్రైవేటు యాజ మాన్య పరిధిలో ఎక్కడైనా ఇలాంటి జాప్యమే జరిగితే వార్నింగ్‌ లేకుండా విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తారు. అంతలా వ్యవహరించే ఈపీడీసీఎల్‌ మాత్రం తానేమీ ఎరగనట్టుగానే వ్యవహరిస్తోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరీజు వేసు కోవాల్సిన ఆ శాఖ ప్రైవేటుపరంగా ఒత్తిడి పెంచిందే తప్ప ప్రభుత్వ బకాయిలను మాత్రం చూసీ చూడనట్టు వదిలేసింది.


Updated Date - 2021-11-27T05:24:12+05:30 IST