మొద్దు నిద్రలో ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-07-31T05:50:56+05:30 IST

కరోనా, అతిసార బాధితుల విషయంలో ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి, కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

మొద్దు నిద్రలో ప్రభుత్వం
చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శిస్తున్న టీడీపీ నాయకులు

  1. టీడీపీ నాయకుల ధ్వజం
  2. అనుగొండ అతిసార బాధితులకు పరామర్శ 
  3. పార్టీ తరపున ఆదుకుంటామని హామీ 


కోడుమూరు(రూరల్‌), జూలై 30: కరోనా, అతిసార బాధితుల విషయంలో ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి, కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు  అన్నారు. అనుగొండలో అతిసార మృతుల కుటుంబాలను శుక్రవారం పరామర్శించారు. కోట్ల మాట్లాడుతూ కోడుమూరు మండలంలో 67 అతిసార కేసులు నమోదు కాగా అనుగొండలో ముగ్గురు చనిపోయారన్నారు. పైప్‌లైన్‌లో కలుషిత నీరు రావడంతో అతిసార ప్రబలిందని తెలిపారు. ప్రస్తుత పాలకులకు దోచుకోవడం, రాబోయే ఎన్నికల్లో గెలవడం మీదనే దృష్టి తప్ప ప్రజలు, రైతులపై ప్రేమ లేదని ధ్వజమెత్తారు. అలాగే కరోనాతో మృతి చెందిన గంగాధర్‌ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. సోమిశెట్టి మాట్లాడుతూ ప్రజలను కాపాడలేని ఈ ప్రభుత్వం శుద్ధ దండగన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని, అనుగొండలో అతిసారతో ముగ్గురు చనిపోతే పరామర్శించడానికి కూడా రాక పోవడమేమిటని ప్రశ్నించారు. పార్టీ వైపు నుంచి బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం దొంగ నవరత్నాలు అమలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతోందని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు కేటాయించిన 14వ ఆర్థిక సంఘం నిధులు విద్యుత్‌ బకాయిలకు, 15వ ఆర్థిక సంఘం నిధులు నవరత్నాలకు బదలాయిస్తోందని ఆరోపించారు. అంతకుముందు వారు వైద్యశిబిరానికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్‌, మండల అధ్యక్షురాలు కోట్ల కవితారెడ్డి, స్థానిక నాయకులు టీచర్‌ రామకృష్ణారెడ్డి, పద్మనాభరెడ్డి, బంకు గిడ్డయ్య, సుంకన్న, శివకృష్ణ, నడిపి నాగయ్య, రామకృష్ణ, లింగేశ్వరయ్య, విశ్వేశ్వరయ్య, ఖాజా పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T05:50:56+05:30 IST