కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-05-17T04:43:48+05:30 IST

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి కుటుంబ సభ్యులను కాపాడుకోవాలని మాజీ మంత్రి సిహెచ్‌.అయ్యన్నపాత్రుడు సూచించారు.

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

  లాక్‌డౌన్‌ విధిస్తే పాజిటివ్‌ రేటు తగ్గే అవకాశం

 మద్యం డోర్‌ డెలివరీకి ఏర్పాట్లు చేయాలి

 మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం, మే 16 : కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి కుటుంబ సభ్యులను కాపాడుకోవాలని మాజీ మంత్రి సిహెచ్‌.అయ్యన్నపాత్రుడు సూచించారు. ఆదివారం ఆయన విలేఖరులకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ విధిస్తే పాజిటివ్‌ రేటు తగ్గే అవకాశం ఉందని, ఈ దిశగా ముఖ్యమంత్రి అలోచన చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దినసరి కూలీల పరిస్థితిపై దృష్టి పెట్టాలన్నారు. మునిసిపాలిటీ నిధులతో వీరికి భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు. మద్యం దుకాణాలు కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయని, ఇంటింటికీ తిరిగి మద్యం విక్రయించే ఏర్పాటుపై ఆలోచన చేయాలన్నారు. కొవిడ్‌తో మరణించే వారి దహనసంస్కారాల బాధ్యతను మునిసిపాలిటీ తీసుకోవాలని కోరారు.  రైతుల పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.


Updated Date - 2021-05-17T04:43:48+05:30 IST