చిన్నారి ఘటనలో.. ప్రభుత్వం విఫలం..: షర్మిల

ABN , First Publish Date - 2021-09-17T00:09:02+05:30 IST

హైదరాబాద్: సింగరేణి చిన్నారి ఘటనలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌‌‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో

చిన్నారి ఘటనలో.. ప్రభుత్వం విఫలం..: షర్మిల

హైదరాబాద్: సింగరేణి చిన్నారి ఘటనలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌‌‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో నియంత పాలన నడుస్తోందన్నారు. ఇది ఆప్ఘనిస్తానా.. అంటూ ఫైర్ అయ్యారు. అత్యాచార ఘటనల్లో నిందితులకు శిక్షలు వేయకపోతే.. మరెన్నో జరుగుతూనే ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇలా జరుగుతోందని మండిపడ్డారు.


రాష్ట్రంలో ఎక్కడ చూసినా గల్లీకో వైన్ షాపు దర్శనమిస్తోందని చెప్పారు. మత్తులోనే ఎక్కువ దారుణాలు జరుగుతున్నాయన్నారు. ప్రజల్లోకూడా చైతన్యం రావాలని సూచించారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్.. ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం గమనించాలని చెప్పారు. నిందితులు ఆత్మహత్యలు చేసుకునే వరకూ పట్టించుకోకపోతే.. ప్రభుత్వాలు, పోలీసులు ఎందుకని షర్మిల ప్రశ్నించారు. 6 ఏళ్ళ చిన్నారిని అత్యాచారం చేసి హత్యచేస్తే.. 7 రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వారు పేదవారు కాబట్టే.. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని చెప్పారు. తాము దీక్ష చేసిన తర్వాతే ప్రభుత్వంలో చలనం వచ్చిందని తెలిపారు.


శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమపై.. రాత్రి 2 గంటల సమయంలో 200మంది పోలీసులు దాడి చేశారన్నారు. బలవంతంగా హౌస్ అరెస్ట్ చేశారని ఆరోపించారు. శాంతియుతంగా దీక్ష చేసే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. దీక్ష చేస్తున్న వారిపై దాడులు చేయడం.. తాలిబన్ల చర్యను తలపిస్తోందని చెప్పారు. చిన్నారికి ప్రభుత్వం, పోలీసులు చేయలేని న్యాయం.. దేవుడు చేశాడన్నారు. జగిత్యాలలో కూడా ఇలాంటి  ఘటనే మరోటి జరిగిందని తెలిపారు. ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోరు అనే ధైర్యంతోనే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పారు. మత్తు పదార్థాల కారణంగా యువత పాడై పోతోందన్నారు.


రాష్ట్రంలో 300 బడులు తీసేశారని, 14,000 మంది టీచర్లను తొలగించారని చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యాక 300 శాతం మద్యం విక్రయాలు పెరిగిపోయాయని వివరించారు. అలాగే 300శాతం మహిళల పైన దాడులు పెరిగాయని తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించడం కేసీఆర్, పోలీసుల వైఫల్యమే కారణమని షర్మిల వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-09-17T00:09:02+05:30 IST