తెలుగు భాష, సంస్కృతులకు ప్రభుత్వాల ప్రోత్సాహం అంతంతే!

ABN , First Publish Date - 2021-12-05T09:03:58+05:30 IST

తెలుగు భాష, సంస్కృతులు కొంచెం తక్కువ స్థాయిలోకి పడిపోయే పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు.

తెలుగు భాష, సంస్కృతులకు ప్రభుత్వాల ప్రోత్సాహం అంతంతే!

ఘంటసాల శతజయంతి వేడుకల ప్రారంభ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

 పి. సుశీలకు ఘంటసాల శతజయంతి ప్రత్యేక పురస్కారం 


హైదరాబాద్‌సిటీ, డిసెంబరు4(ఆంధ్రజ్యోతి): తెలుగు భాష, సంస్కృతులు కొంచెం తక్కువ స్థాయిలోకి పడిపోయే పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు. ‘‘తెలుగు భాషను, సంస్కృతిని, తెలుగువారి ఔచిత్యాన్ని తెలుగు ప్రజలుగా మనమంతా దిగజార్చేవిధంగా ప్రవర్తిస్తున్నామేమో అనిపిస్తోం ది. ఈ మాటలను బాధ్యత కలిగిన ఒక తెలుగు వాడిగా ఆవేదనతో చెబుతున్నాను’’ అని అన్నా రు. తెలుగు మాధ్యమంలో చదివితే ఉద్యోగాలు రావనే భ్రమ, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరలేమనే అపోహ వెరసి మన మాతృభాషను మనమే చతికిలపడేలా చేస్తున్నామని బాధపడ్డారు. దీనికి తోడు తెలుగు భాష, సంస్కృతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు అనుకున్నంతగా మద్దతు ఇవ్వడం లేదని అన్నారు. ఆంగ్ల భాష నేర్చుకుంటేనే అవకాశాలు పెరుగుతాయనే అపోహను సృష్టిస్తున్నారని, అది నిజం కాదనే విషయాన్ని సామాన్యులంతా గుర్తించాలని హితవు పలికారు.


ఎనిమిదో తరగతి వర కు తనకు ఆంగ్లం అంతగా తెలియదని.. డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నాననని, అయినప్పటికీ ఢిల్లీ వరకు వెళ్లగలిగాననే విషయాన్ని గతంలో ప్రధాని, రాష్ట్రపతి సమక్షంలోనూ చెప్పానని గుర్తుచేసుకున్నారు.  సంగ మం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివారం రవీంద్రభారతిలో ఘంటసాల వేంకటేశ్వరరావు శతజయంతి వేడుకలను జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఘంటసాల నిష్క్రమించి నాలుగు దశాబ్దాలు దాటినా, ఆయన పాట తెలుగు వారిని నిత్యం పలకరిస్తూనే ఉందని కొనియాడారు. ఘంటసాల శతజయంతి కార్యక్రమాన్ని తాను ఢిల్లీలోనూ నిర్వహిస్తానని జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రకటించారు.


 సుశీలకు సన్మానం

సంగమం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గానకోకి ల, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత పి. సుశీలకు ఘంటసాల శతజయంతి ప్రత్యేక పురస్కారాన్ని  జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రదానం చేశారు. అలనాటి నటి, నిర్మాత సి. కృష్ణవేణి, ప్రముఖ సినీనటు డు మురళీ మోహన్‌, ‘మన ఘంటసాల’ పుస్తక రచయిత పీఎస్‌ గోపాలకృష్ణలను ఘంటసాల స్మారక ప్రత్యేక పురస్కారాలతో సన్మానించారు. సన్మాన స్వీకర్త సుశీలమ్మ మాట్లాడుతూ తనకు దక్కిన గుర్తింపు, గౌరవం ఘంటసాల పెట్టిన భిక్షే అన్నారు. తనను ప్రధాని నరేంద్రమోదీ వద్దకు తీసుకెళ్లాల్సిందిగా జస్టిస్‌ ఎన్వీ రమణను సుశీల కోరారు. హిందీ, ఇంగ్లిషు రాని తాను తెలుగులోనే మోదీతో పరిచయం చేసుకొని మా ట్లాడతానని చెప్పారు. కార్యక్రమంలో మండలి బుద్ధప్రసాద్‌, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకుడు వరప్రసాద్‌ రెడ్డి, సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నృత్యకారిణి మంజుభార్గవి, ప్రముఖ సినీనటుడు ఆర్‌. నారాయణమూర్తి, సంగమం ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సంజయ్‌ కిషోర్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. వందమంది చిన్నారులు కలిసి ముక్తకంఠంతో సుమారు యాభై ఘంటసాల గీతాలను ఆలపించడం సభికులను ఆకట్టుకుంది.


మంచి సినిమాలు తీయండి..

సినిమా రంగం తొలిరోజుల్లో చాలా బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించిదని, సమాజంలోని అనేక రుగ్మతలను నిలదీయడంలోనూ, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలోనూ, తెలుగు భాషను పలకడంలోనూ, తెలుగు సాహిత్యంలోని గొప్పతనాన్ని తెలియజెప్పడంలోనూ సినిమా ముఖ్య భూమిక పోషించిందని జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఇప్పటి సినిమా నటు లు, గాయకులు తెలుగు ఉచ్ఛారణను నేర్చుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.  మం చి సినిమాలు తీయాలని ఆకాంక్షించారు.

Updated Date - 2021-12-05T09:03:58+05:30 IST