ప్రభుత్వం ప్రకటించింది తిరకాసు పీఆర్‌సీ

ABN , First Publish Date - 2022-01-25T06:40:13+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీ తిరకాసుగా ఉందని, ఉపాధ్యాయులకు కలిసివచ్చేది ఏమీలేదు సరికదా.. తిరిగి ఉపా ధ్యాయులే సొమ్ము చెల్లించేలా ఉందని ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఆరోపించారు.

ప్రభుత్వం ప్రకటించింది తిరకాసు పీఆర్‌సీ
నూతన పీఆర్‌సీతో నష్టంపై ఉపాధ్యాయులకు వివరిస్తున్న ఎమ్మెల్సీ రఘువర్మ

  కలిసి వచ్చేది  లేదు సరికదా.. తిరిగి నష్టం 

 ఉపాధ్యాయులు, ఉద్యోగుల హక్కులు కాలరాయడం తగదు

 సీపీఎస్‌, నూతన పీఆర్‌సీ విధానాన్ని రద్దు చేయాలి 

 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ 

నక్కపల్లి, జనవరి 24 : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీ తిరకాసుగా ఉందని, ఉపాధ్యాయులకు కలిసివచ్చేది ఏమీలేదు సరికదా.. తిరిగి ఉపా ధ్యాయులే సొమ్ము చెల్లించేలా ఉందని ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఆరోపించారు. ఇక్కడి కేజీబీవీ సహా నక్కపల్లి, జానకయ్యపేట, రాజయ్యపేట, చినదొడ్డిగల్లు, వేంపాడు, డీఎల్‌పురం హైస్కూళ్లను సోమవారం ఆయన సందర్శిం చారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీ, ఇతర విధానాల వల్ల ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వాటిల్లే నష్టంపై   అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌, జేఏసీ తరఫున ప్రభుత్వంపై రాజీలేని పోరా టం సాగిస్తున్నామని చెప్పారు. ఉపా ధ్యాయులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని ఎండగట్టారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల హక్కులను కాలరాయడం తగదన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.  సీపీఎస్‌, నూతన పీఆర్‌సీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్స్‌ తగ్గించడం భావ్యం కాదన్నారు. నూతన పీఆర్‌సీపై అశుతోశ్‌ మిశ్రా కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలన్నారు. ఏపీటీఎఫ్‌ ప్రతినిధులు బి.వెంకటపతిరాజు, ఎన్‌వీ ఎస్‌ ఆచార్యులు, దాడిశెట్టి కొండలరావు, కె.రంగబాబు, సీహెచ్‌.అప్పలరాజు, శ్రీనివాసరావు, కుందూరు రాజు, సురేశ్‌ కుమార్‌, సురేశ్‌, బాలు  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T06:40:13+05:30 IST