పార్టీల విధానాలు మారాలి

ABN , First Publish Date - 2022-05-06T13:31:25+05:30 IST

ఐదేళ్ల కాలానికి సంబంధించి పార్టీలు రూపొందించే పథకాలు, ప్రణాళికలు ఆయా పార్టీలు అధికారంలోకి రాగానే అర్థాంతరంగా ఆగిపోతున్నాయని రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆందోళన వ్యక్తం చేశారు

పార్టీల విధానాలు మారాలి

- అర్ధాంతరంగా ఆగిపోతున్న ప్రణాళికలు, పథకాలు

- గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆందోళన


చెన్నై: ఐదేళ్ల కాలానికి సంబంధించి పార్టీలు రూపొందించే పథకాలు, ప్రణాళికలు ఆయా పార్టీలు అధికారంలోకి రాగానే అర్థాంతరంగా ఆగిపోతున్నాయని రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు ప్రజలకోసం ఐదేళ్లకు సరిపడా పథకా లు రూపొందించినట్లు గొప్పలు చెప్పుకునే పార్టీలు అధికారంలోకి వచ్చాక వాటిలో సగాన్ని కూడా అమలు చేయలేక కుదేలవుతున్నాయని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చే పార్టీ పాత పథకాలను పక్కనబెట్టి మళ్ళీ మొదటి నుంచి కొత్త పథకాలను అమలు చేస్తున్నాయని, ఈ పరిస్థితి మారాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలో గురువారం ఉదయం ‘మత్స్య సంపద, మత్స్యపెంపకం’ అనే అంశంపై ఏర్పాటైన జాతీయ సదస్సును ప్రారంభించిన అనంతరం గవర్నర్‌ ప్రసంగించారు. దేశం నలుమూలల నుంచి ఈ సదస్సుకు శాస్త్రవేత్తలు, మేధావులు హాజరుకావడం తనకెంతో ఆనందంగా ఉందని, ఆధ్మాతికంలో సంస్కృతీ సంప్రదాయాలో అభివృద్ధి చెందిన ఈ రాష్ట్రం నుంచి వీరంతా నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయని సూచించారు. మత్స్య పరిశ్రమలో దేశం ఇంకా వెనుకబడే ఉందని, మత్స్య సంపదను అధికం చేసేందుకు, మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేయాలని పిలుపునిచ్చారు. పది నాటికల్‌ మైళ్ల దూరంలోనూ మత్స్య సంపదను పెంచే దిశగా ఆ పరిశోధనలు ఉండాలని, అప్పుడే జాలర్లు ఆర్థికపరంగా అభివృద్ధి చెందగలుగుతారని పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో శాటిలైట్‌ ద్వారా మత్స్య సంపద ఏ ప్రాంతంలో అధికంగా ఉంటుందో సులువుగా తెలుసుకోగులుతున్నారని, ఆ విధమైన పద్ధతి మన దేశంలో అమలులోకి రావాలన్నారు. మత్స్యశాఖలో సవాళ్లు అధికమని, కఠోర శ్రమ ద్వారానే ఈ శాఖను అభివృద్ధి చేయగలుగుతామని చెప్పారు. కేంద్ర మత్స్యశాఖ మంత్రి పర్‌స్తొం రూపాలా, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ పాల్గొన్నారు.

Read more