ఆ బిల్లుల్ని ఆమోదించి ప్రజాభీష్టాన్ని నెరవేర్చండి

ABN , First Publish Date - 2022-06-03T14:57:50+05:30 IST

రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో వున్న బిల్లుల్ని ఆమోదించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం జలవనరుల

ఆ బిల్లుల్ని ఆమోదించి ప్రజాభీష్టాన్ని నెరవేర్చండి

                   - గవర్నర్‌కు స్టాలిన్‌ విజ్ఞప్తి


చెన్నై, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో వున్న బిల్లుల్ని ఆమోదించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం జలవనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌, ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి, పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసుతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి సుమారు అర్ధగంట సేపు గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ను సత్కరించిన సీఎం.. నీట్‌ నుంచి మినహాయింపు కోరుతూ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో వున్న బిల్లుల్ని కూడా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా త్వరలో వైద్య విద్యార్థుల అడ్మిషన్లు ప్రారంభం కానున్నందున ‘తమిళనాడు సిద్ధ వైద్య యూనివర్సిటీ బిల్లు’ను ఆమోదించాలని కోరారు. అదే విధంగా తమిళనాడు కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ (సవరణ) బిల్లు, తమిళనాడు హౌసింగ్‌ బోర్డు బిల్లు, తమిళనాడు యూనివర్సిటీ బిల్లుల్ని శాసనసభ తీర్మానించి గవర్నర్‌ ఆమోదం కోసం పంపిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ ఆమోదించిన బిల్లుల్ని ఆమోదించడం ద్వారా ప్రజాభీష్టాన్ని గౌరవించడం మనందరి కర్తవ్యమన్నారు. అందువల్ల శాసనసభ ఆమోదించిన బిల్లులకు సాధ్యమైనంత త్వరగా మోక్షం ప్రసాదించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అవన్నీ ఆలకించిన గవర్నర్‌ పరిశీలిస్తానని చెప్పినట్లు సమాచారం. గవర్నర్‌ వద్ద మొత్తం 21 బిల్లులు పెండింగ్‌లో వున్నట్లు తెలుస్తోంది. రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో వున్న బిల్లుల్ని ఆమోదించాలంటూ గతంలోనూ స్టాలిన్‌ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. మరీ ముఖ్యంగా నీట్‌ బిల్లు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగిన నేపథ్యంలో ఎట్టకేలకు తలొగ్గిన గవర్నర్‌.. ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపిన విషయం తెలిసిందే. అయినా ఆయన వద్ద ఇంకా ముఖ్యమైన బిల్లులు పెండింగ్‌లో వున్నాయి. ఇందులో తమిళనాడు యూనివర్సిటీ బిల్లు గవర్నర్‌ అధికారాలకు కత్తెర వేసేదిగా వుంది. దానిని గవర్నర్‌ ఒకసారి తిరస్కరించినప్పటికీ రెండోమారు మళ్లీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే దానిని ఆమోదించడం మినహా గవర్నర్‌ వద్ద మరో ప్రత్యామ్నాయం లేదు. అందుకే గవర్నర్‌ ఆ బిల్లు జోలికి పోకుండా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మిగిలిన బిల్లులు ఆమోదం పొందితే పాలనలో పలు సంస్కరణలు తీసుకురావడంతో పాటు తాము అనుకున్న పనులను వేగవంతం చేయవచ్చని స్టాలిన్‌ బృందం భావిస్తోంది. కానీ గవర్నర్‌ ఆ బిల్లులకు మోకాలడ్డుతుండడంతో సీఎం అసంతృప్తితో వున్నారు. అయినా అది ఎక్కడా కనిపించనీయకుండా గవర్నర్‌ను కలుసుకుని బిల్లుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేయడం విశేషం.

Updated Date - 2022-06-03T14:57:50+05:30 IST