గౌడ హాస్టల్ కార్యవర్గ సమావేశం రసాభాస
ABN , First Publish Date - 2021-04-19T06:47:10+05:30 IST
గౌడ హాస్టల్ కార్యవర్గ సమావేశం రసాభాసగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేయడంతో వివాదం సద్దుమణిగింది.
పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
హిమాయత్నగర్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): గౌడ హాస్టల్ కార్యవర్గ సమావేశం రసాభాసగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేయడంతో వివాదం సద్దుమణిగింది. ఆదివారం ఉదయం గౌడ హాస్టల్ పాలక మండలి సర్వసభ్య సమావేశం నిర్వహించాలని భావించారు. అనుకున్నంతమంది సభ్యులు హాజరు కాకపోవడంతో అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావుగౌడ్ సమావేశాన్ని వాయిదా వేయడానికి సమయత్తమవుతున్నారు. ఈ దశలో లక్ష్మణ్రావు వ్యతిరేక వర్గంలోని నాయకులు అయిలి వెంకన్నగౌడ్, బాలగోని బాలరాజ్గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు లేకుండా సమావేశం ఎలా ఏర్పాటుచేశారని ఆయనతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి తోపులాట వరకు దారితీస్తుందని భావించిన కొందరు సభ్యులు పోలీసులకు సమాచారమివ్వడంతో నారాయణగూడ పీఎస్ సీఐ భూపతి గట్టుమల్లు, ఎస్ఐలు చంద్రశేఖర్రెడ్డి, చందర్సింగ్ అక్కడికి చేరుకుని నేతలను శాంతింపచేశారు. ఈ సందర్భంగా వెంకన్నగౌడ్, బాలరాజ్గౌడ్ లక్ష్మణ్రావుపై పలు ఆరోపణలు చేశారు. ఉప్పల్లో కొత్తగా నిర్మిస్తున్న హాస్టల్ భవనంలో అవినీతి జరిగిందని, హాస్టల్ కమిటీలో ముగ్గురు ప్రధాన కార్యదర్శులు రాజీనామా చేసినా లక్ష్మణ్రావు ఆమోదించలేదని ఆరోపించారు. హాస్టల్ నిర్మాణానికి సంబంధించిన చెల్లింపులన్నీ ఆన్లైన్లో రికార్డెడ్గా ఉన్నాయని, సభ్యులు వాటిని చూడొచ్చన్నారు. ప్రధాన కార్యదర్శులు రాజీనామాలపై వారినే అడగాలని, సభ్యుల ఆమోదంతోనే రాజీనామాలు ఆమోదించాల్సి ఉంటుందని లక్ష్మణ్రావు వారికి స్పష్టం చేశారు.