పింఛన్లు, రేషన్ బియ్యం ఆపేస్తారా?
ABN , First Publish Date - 2020-09-27T06:54:10+05:30 IST
బీజేపీకి ఓటేస్తే పింఛన్లు, రేషన్ బియ్యం ఆపేస్తామని మంత్రి హరీశ్రావు, నాయకులు బెదిరిస్తున్నారని.. వారికి అంత దమ్ము ఉందా అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు...
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
చేగుంట, సెప్టెంబరు: బీజేపీకి ఓటేస్తే పింఛన్లు, రేషన్ బియ్యం ఆపేస్తామని మంత్రి హరీశ్రావు, నాయకులు బెదిరిస్తున్నారని.. వారికి అంత దమ్ము ఉందా అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. చేగుంటలో మండలం వడియారంలో ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో టీఆర్ఎస్ అసమ్మతి నాయకులు మాజీ ఎంపీపీ పాండు, మాజీ జడ్పీటీసీ శోభారాణి, మాజీ సర్పంచులు బాలచందర్, రాజగోపాల్ ఆధ్వర్యంలో 1,500 మంది బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నాయని అన్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడుతున్నారని టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పుకుంటున్నదని, కానీ రాష్ట్రం కట్టాల్సిన విద్యుత్ బకాయిలు రూ. పదివేల కోట్లను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయడంతోనే అది సాధ్యమైందని తెలిపారు. మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి బాబుమోహన్ మాట్లాడుతూ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని విమర్శించారు. బీజేపీకి ఓటువేసి తనని ఆశీర్వదించాలని రఘునందన్రావు కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, బాలేష్ గౌడ్ చింతల భూపాల్, గోవింద్, చంద్రమౌళి, స్వామి, సాయిరాజ్, ఆనంద్ పాల్గొన్నారు.