గొర్రిపూడిలో వైరల్‌ జ్వరాల పంజా

ABN , First Publish Date - 2022-08-10T06:49:38+05:30 IST

మండలంలోని గొర్రిపూడిలో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలో పెద్ద సంఖ్యలో ఫీవర్‌ కేసులు నమోదవుతున్నా వైద్యాధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

గొర్రిపూడిలో వైరల్‌ జ్వరాల పంజా

గొర్రిపూడి(కరప), ఆగస్టు 9 : మండలంలోని గొర్రిపూడిలో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలో పెద్ద సంఖ్యలో ఫీవర్‌ కేసులు నమోదవుతున్నా వైద్యాధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్లేట్‌లెట్స్‌ పడిపోతుండడంతో అవి డెంగీ జ్వరాలని గ్రామస్తులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అక్కడక్కడా డెంగీ కేసు లు కూడా నమోదైనట్టు వారు చెబుతున్నారు. తీవ్రమైన జ్వరం, కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఇప్పటికే పలువురు ఆసుపత్రిపాలయ్యారు. పెదపుంతకు చెందిన యర్రంనీడి శ్రీనివాస్‌, గడ్డిపాడుకు చెందిన 14 ఏళ్ల గండి బాబులు తీవ్రమైన జ్వరంతో బాధపడు తూ కాకినాడలోని ప్రైవేట్‌ ఆసుపత్రిల్లో చికిత్సపొందుతున్నారు. వారి పరిస్థితి సీరియస్‌ గా ఉన్నట్టు తెలిసింది. బతుకుదెరువు కోసం ఐదు నెలల కిందట గ్రామానికి వచ్చిన జుట్టా తేజశ్విని అనే మహిళ ఇటీవలే జ్వరంతో బాధపడుతూ మృతిచెందినట్టు గ్రామస్తుడు అనుకుల రాంబాబు తెలిపారు. జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలతో పలువురు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. గ్రామంలో జ్వరాల బారినపడి మంచాన పడుతున్నా వైద్యాధికారులు పట్టించుకోవడంలేదని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వర్షాల వల్ల ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి దోమలు విజృంభిస్తున్నాయి. పారిశుధ్య పనులు సక్రమంగా చేయకపోవడంతో అనారోగ్యాలు ప్రబలుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటుచేసి శానిటేషన్‌ పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 



Updated Date - 2022-08-10T06:49:38+05:30 IST