ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే ఉంటాం : గోరంట్ల
ABN , First Publish Date - 2021-05-08T21:01:53+05:30 IST
ఫిబ్రవరి మాసంలోనే జగన్ సర్కార్ మేల్కొని, ఆక్సిజన్ సరఫరా, వెంటిలేటర్లపై దృష్టి నిలిపితే పరిస్థితి మరొకలా
రాజమండ్రి : ఫిబ్రవరి మాసంలోనే జగన్ సర్కార్ మేల్కొని, ఆక్సిజన్ సరఫరా, వెంటిలేటర్లపై దృష్టి నిలిపితే పరిస్థితి మరొకలా ఉండేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇతర రాష్ట్రాలకు కంటైనర్లకు కంటైనర్లు ఆక్సిజన్ తరలిపోతుంటే ప్రధానిని పొగడటమే సీఎం జగన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ప్రభుత్వం చెబుతున్న మరణాల లెక్కలకు, చనిపోతున్న వారి సంఖ్యకు పొంతనే లేదని మండిపడ్డారు.
క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి సీఎంకు ఏమాత్రం అవగాహనే లేదని, కోవిడ్ గురించి పనికిమాలిన సలహాదారు సజ్జల మాట్లాడటమేంటని ప్రశ్నించారు. తాము కేసులు పెడితే, కోర్టులకు వెళ్లి కొట్టేయించుకోండి అన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవహారం ఉందని, తప్పుడు కేసులతో ప్రతిపక్షాలను భయపెట్టేలమన్న విషయాన్ని సీఎం జగన్ గ్రహించాలని హితవు పలికారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం, తమకున్న భావ స్వేచ్ఛతో తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటామని గోరంట్ల ప్రకటించారు.