NRI: జగన్ అబద్ధాలకు అంతేలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ABN , First Publish Date - 2022-08-19T03:26:25+05:30 IST

జగన్ చెప్పే అబద్ధాలకు అంతు లేకుండా పోయిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు.

NRI: జగన్ అబద్ధాలకు అంతేలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఎన్నారై డెస్క్: జగన్ చెప్పే అబద్ధాలకు అంతు లేకుండా పోయిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. బుధవారం వాషింగ్టన్ డీసీలో(Washington DC) తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షతన ఎన్ఆర్ఐ తెలుగుదేశం(NRI TDP) పార్టీ సమావేశం జరిగింది. తొలుత సభ్యులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పినవన్నీ అవాస్తవాలన్నారు. అనేక పరిశ్రమలు, కోట్లాది రూపాయల పెట్టుబడులు వచ్చాయని జగన్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ.. వచ్చిన పరిశ్రమల కంటే పోయిన పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ‘‘మౌలిక సదుపాయాలు లేవు. రహదారులు, విద్యుత్ పరిస్థితి చూస్తుంటే ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయేలా ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి పాతర వేసిన జగన్ ప్రభుత్వం’’ అని కామెంట్ చేశారు. ‘‘అనైతికతకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులను ప్రోత్సహిస్తూ ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్ మాఫియా గ్యాంగులను కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు అసాధ్యమని తెలిసీ పాలన వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని అభూతకల్పనలు, అసత్యాలను చెబుతున్నారు’’ అని విమర్శించారు.


గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. ‘‘జగన్ రెడ్డి దోపిడీ విధానాలతోనే రాష్ట్ర విద్యుత్ సంస్థలు దివాలా తీశాయి’’ అని అన్నారు. ఇప్పటివరకు ప్రజలపై సుమారు రూ.16వేల కోట్లు విద్యుత్ ఛార్జీల భారం మోపారని, అయినా విద్యుత్ కోతలు ఆగడం లేదన్నారు. సతీష్ వేమన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఆజాదీ కా అమృతోత్సవ కార్యక్రమాలు జరుగుతుంటే.. రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్లమెంట్ సభ్యుడి నగ్న వీడియోలు చూడాల్సి రావడం సిగ్గుచేటన్నారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జగన్ రెడ్డి భాషా పరిజ్ఞానాన్ని చూసి ప్రపంచం నవ్వుకుంటోందని విమర్శించారు. మూడేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేక ఎదురుదాడి చేశారన్నారు.


భాను మాగులూరి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం సోషల్ మీడియా ద్వారా, ఇతర ప్రచార సాధనాల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తమవంతు కృషిచేయాలన్నారు. మాతృదేశంలో ఉన్న తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల కోసం సమర్థవంతమైన ప్రభుత్వం, ముందుచూపు కలిగిన నాయకుడి అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయిసుధ పాలడుగు, కృష్ణ లామ్, త్రిలోక్ కంతేటి, నాగ్ నెల్లూరి, మన్నే సత్యనారాయణ, సత్య సూరపనేని, యాష్ బొద్దులూరి, రవి అడుసుమిల్లి, సుధీర్ కొమ్మి, రాజశేఖర్ బోయపాటి, కార్తీక్ కోమటి తదితరులు పాల్గొన్నారు.







Updated Date - 2022-08-19T03:26:25+05:30 IST