కరోనా నుంచి గోరఖ్పూర్కు విముక్తి: యోగి ఆదిత్యనాథ్
ABN , First Publish Date - 2021-11-06T20:32:02+05:30 IST
మహాయోగి గోరఖ్నాథ్ పవిత్ర భూమి అయిన గోరఖ్పూర్లో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు జీరో స్థాయికి వచ్చినట్టు..
లక్నో: మహాయోగి గోరఖ్నాథ్ పవిత్ర భూమి అయిన గోరఖ్పూర్లో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు జీరో స్థాయికి వచ్చినట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారంనాడు ప్రకటించారు. ఈ అరుదైన ఫీట్ సాధించడంలో విజయవంతమైన హెల్త్కేర్ వర్కర్లు, ప్రజలను ఆయన శనివారంనాడు ఓ ట్వీట్లో అభినందించారు. ఉత్తరప్రదేశ్లో కరోనా యాక్టివ్ కేసులు అక్టోబర్ నుంచి 100 కంటే తక్కువగానే ఉన్నాయి. శనివారంనాడు యాక్టివ్ కేసుల సంఖ్య 91కి వద్ద ఉంది. గత 24 గంటల్లో ఐదు కొత్త కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.
కాగా, గోరఖ్నాథ్జీ పుట్టిన పుణ్యభూమి గోరఖ్పూర్లో శనివారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, జిల్లా యంత్రాంగం, నిబద్ధత కలిగిన ఆరోగ్య కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల అంకింతభావం, ప్రజల పట్టుదలతోనే ఇది సాధ్యమైందని యోగి ఆదిత్యనాథ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. గోరఖ్నాథ్ మఠానికి ఆదిత్యనాథ్ మహంత్ (ప్రధాన పూజారి)గా కూడా ఉన్నారు. బీజేపీ నుంచి గోరఖ్పూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన 19 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. 2017లో యూపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ సీటును ఖాళీ చేశారు.