గూగుల్‌.. సామాజిక మాధ్యమం కాదు..!

ABN , First Publish Date - 2021-06-03T09:15:28+05:30 IST

కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు ఆన్‌లైన్‌ న్యూస్‌ పబ్లిషర్లకు మాత్రమే వర్తిస్తాయని, సెర్చ్‌ఇంజన్లకు కాదని గూగుల్‌ పేర్కొంది. అలాగే, ఇంటర్‌నెట్‌లోని అభ్యంతరకర విషయాన్ని తొలగించే అంశంలో తమనూ బాధ్యుల

గూగుల్‌.. సామాజిక మాధ్యమం కాదు..!

  • కొత్త ఐటీ నిబంధనలు సెర్చ్‌ఇంజన్లకు వర్తించవు
  • ఢిల్లీ హైకోర్టులో గూగుల్‌ పిటిషన్‌
  • ఏకసభ్య ధర్మాసనం తీర్పును నిలిపివేయాలని వినతి 


న్యూఢిల్లీ, జూన్‌ 2: కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు ఆన్‌లైన్‌ న్యూస్‌ పబ్లిషర్లకు మాత్రమే వర్తిస్తాయని, సెర్చ్‌ఇంజన్లకు కాదని గూగుల్‌ పేర్కొంది. అలాగే, ఇంటర్‌నెట్‌లోని అభ్యంతరకర విషయాన్ని తొలగించే అంశంలో తమనూ బాధ్యుల ను చేస్తూ ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఓ మహిళ ఫొటోలను కొందరు అశ్లీల వెబ్‌సైట్లోకి ఎక్కించిన కేసులో.. వాటిని ప్రపంచవ్యాప్తంగా అన్ని సైట్ల నుంచి తొలగించాలని న్యాయమూర్తి ఆదేశించినప్పటికీ.. అవి ఇతర వెబ్‌సైట్లలో మళ్లీమళ్లీ పోస్ట్‌ అవుతున్నాయి. దీంతో.. న్యాయమూర్తి, అశ్లీల వెబ్‌సైట్లను తమ ప్లాట్‌ఫామ్‌పై అనుమతించ వద్దని సెర్చ్‌ఇంజన్లను ఆదేశించారు. ఈ ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ గూగుల్‌.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.


దీనిపై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ జ్యోతి సింగ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఫేస్‌బుక్‌, అశ్లీల వెబ్‌సైట్‌ సహా బాధిత మహిళకు నోటీసులు జారీ చేసింది. జూలై 25 లోపు కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. కాగా, తమది సెర్చ్‌ఇంజన్‌ మాత్రమేనని, సామాజిక మాధ్యమం కాదని పేర్కొన్న గూ గుల్‌.. ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును నిలిపివేయాల్సిందిగా చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. 

Updated Date - 2021-06-03T09:15:28+05:30 IST