భారత్‌లో రూ.75వేల కోట్ల పెట్టుబడులు: గూగుల్ సీఈవో పిచాయ్

ABN , First Publish Date - 2020-07-13T21:14:13+05:30 IST

రానున్న 5-7 సంవత్సరాల్లో ఇండియాలో దాదాపు రూ.75వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు...

భారత్‌లో రూ.75వేల కోట్ల పెట్టుబడులు: గూగుల్ సీఈవో పిచాయ్

కాలిఫోర్నియా: రానున్న 5-7 సంవత్సరాల్లో ఇండియాలో దాదాపు రూ.75వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ మేరకు ఆల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ నేడు ఓ ప్రకటన చేశారు. గూగుల్ ఫర్ ఇండియాలో భాగంగా డిజిటైజేషన్‌ ఫండ్ రూపంలో ఈ పెట్టుబడులు ఉండనున్నట్లు తెలిపారు. భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని పిచాయ్ వెల్లడించారు. ఈక్విటీ వాటాలలు, సంస్థల్లో భాగస్వామ్యం, పర్యావరణ హిత మౌలిక సదుపాయాల కల్పన తదితర కార్యకలాపాల్లో ఈ పెట్టుబడులు ఉండనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా వైద్య విద్య, వ్యవసాయ రంగాల్లో ఏఐ, వ్యాపార అభివృద్ధి, భారత్‌లో ఎన్నడూ లేని సరికొత్త ప్రాడక్ట్‌ల ఉత్పత్తి, భారతీయ భాషలపై ముఖ్యంగా దృష్టి సారించినట్లు చెప్పారు. భవిష్యత్ టెక్నాలజీను భారత్‌ ముందుండి నడిపించాలనేదే తన కోరిక అని పిచాయ్ అన్నారు. 


ఇదిలా ఉంటే భారత ప్రధాని నరేంద్ర మోదీతో వర్చువల్ మీటింగ్ అనంతరం పిచాయ్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీ ఓ ట్వీట్ కూడా చేశారు. అనేక విషయాలపై కూలంకషంగా చర్చించామని అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా భారతీయ రైతులు, యువతరం, వ్యాపారవేత్తల భవిష్యత్తును మార్చేయగల టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై చర్చించామని ప్రధాని వెల్లడించారు.



Updated Date - 2020-07-13T21:14:13+05:30 IST