ఆటగాళ్లు త్వరగా నిద్రపోవాలి: రాహుల్ ద్రావిడ్

ABN , First Publish Date - 2021-11-23T02:15:21+05:30 IST

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేయడంపై టీమిండియా కొత్త కోచ్

ఆటగాళ్లు త్వరగా నిద్రపోవాలి: రాహుల్ ద్రావిడ్

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేయడంపై టీమిండియా కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సిరీస్‌లోనే జట్టు నెగ్గడం ఆనందంగా ఉందన్నాడు. అయితే, ఈ విజయాన్ని చూసి ఆటగాళ్లు పొంగిపోకూడదని, నేలపైనే ఉండాలని సూచించాడు. ఇది నిజంగా గొప్ప విజయమని, ప్రతీ ఆటగాడు బాగానే ఆడాడని ప్రశంసించాడు. ఇది చాలా గొప్ప విషయమని, మంచి ఆరంభమని అన్నాడు. 

  

కుర్రాళ్లు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్న ద్రావిడ్.. ఈ సిరీస్‌లో అవకాశం దక్కించుకున్న యువ ఆటగాళ్లు రాణించారని, ఇది శుభపరిణామమని అన్నాడు. అయితే, గత కొన్ని నెలలుగా ఆడని వారికి అవకాశాలు కల్పించాల్సి ఉందన్నాడు.


‘‘మనకు కొన్ని మంచి నైపుణ్యాలు ఉన్నాయి. వాటిని నిర్మించుకుంటూ ముందుకెళ్లాలి. ఇక్కడి నుంచి ప్రపంచకప్ వరకు ఎంతో ప్రయాణం ఉంది. కుర్రాళ్లు వాస్తవికంగా ఉండాలి. అనుభవం ఉన్న ఆటగాళ్లు ఎంత మేరకు ఆటగలరనేది చూడాలి’’ అని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. త్వరలోనే కివీస్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆటగాళ్లు త్వరగా నిద్రపోవాలని, అదే విషయాన్ని వారితో చెబుతానని ద్రావిడ్ పేర్కొన్నాడు. 

Updated Date - 2021-11-23T02:15:21+05:30 IST