Womens Day కు ముందే కేసీఆర్ సర్కార్ తీపి కబురు..
ABN , First Publish Date - 2022-03-08T12:06:28+05:30 IST
మహిళా దినోత్సవం ముందు రోజే ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
- మహిళా వర్సిటీ.. సదుపాయాల మాటేంటి..?
- తొలి మహిళా వర్సిటీ ప్రకటనపై హర్షం
- మరిన్ని నిధులు అవసరమని సూచనలు
హైదరాబాద్ సిటీ : మహిళా దినోత్సవం ముందు రోజే ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కోఠి మహిళా కాలేజీని తొలి మహిళా వర్సిటీగా మార్చడమే కాకుండా బడ్జెట్లో రూ. 100 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మంత్రి హరీశ్రావు సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. దీనిపై మహిళా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీకి మాజీ మంత్రి సదాలక్ష్మి పేరు పెట్టాలని పలువురు కోరుతున్నారు. మహాలఖాబాయి చందా పేరు పెట్టాలని మరికొందరు అడుగుతున్నారు. ఇదే సమయంలో ‘వర్సిటీగా మారుస్తారు సరే! మౌలిక సదుపాయాల మాటేంటి’ అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సుమారు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని సూచిస్తున్నారు.
కొత్త భవనాలు అవసరం
కోఠి ఉమెన్స్ కాలేజీ విశ్వవిద్యాలయంగా మారితే అంతకు మించిన సంతోషం లేదు. అందుకు అన్ని అర్హతలూ మా కాలేజీకి ఉన్నాయి. అయితే, తరగతి గదుల కోసం కొత్త బ్లాకులు నిర్మించాల్సిన అవసరం ఉంది. హాస్టల్ కేపాసిటీని మూడు వేలమందికి సరిపడా పెంచాలి. అధ్యాపక పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలి.
- ఆచార్య ఎం విద్యుల్లత, ప్రిన్సిపాల్, కోఠి మహిళా కాలేజీ.