Hyderabadలోని ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్..!
ABN , First Publish Date - 2021-12-21T14:09:55+05:30 IST
వచ్చే ఏడాది నుంచి ఎలక్ర్టిక్ వాహనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు
- మూడు కిలోమీటర్లకో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్
- ప్రస్తుతం 70, త్వరలో మరో 118
- మాల్స్, గేటెడ్ కమ్యూనిటీల్లో ఏర్పాటుపై టీఎస్ రెడ్కో ప్రచారం
హైదరాబాద్ సిటీ : పెరుగుతున్న ఎలక్ర్టిక్ వాహనాలకు అనుగుణంగా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై టీఎస్ రెడ్కో దృష్టి సారిస్తోంది. ప్రతీ మూడు 3 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం గ్రేటర్లో పది వేల ఎలక్ర్టిక్ వాహనాలు రోడ్లపై తిరుగుతున్నట్లు అంచనా. వచ్చే ఏడాది నుంచి ఎలక్ర్టిక్ వాహనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటికే నగరంలో 70కి పైగా ఎలక్ర్టిక్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి.
ఒక్కో యూనిట్కు 6 రూపాయిలు..
ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు చేసిన చార్జింగ్ స్టేషన్లలో ఎలక్ర్టిక్ వాహనాల చార్జింగ్కు యూనిట్కు రూ.15-20 వసూలు చేస్తున్నారు. ఆయా స్టేషన్లకు విద్యుత్ శాఖ యూనిట్ రూ. 6కే ఇస్తోంది.
విస్తృత ప్రచారం..
ఎలక్ర్టిక్ వాహనాల వినియోగం, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై టీఎస్ రెడ్కో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఈ వాహనాలపై ఉన్న అపోహలు తొలగించేందుకు గో ఎలక్ర్టిక్ క్యాంపెయిన్, రోడ్ షోలతో పాటు పలు ప్రదర్శనలు చేపడుతోంది.
త్వరలో మరో 118 స్టేషన్లు వినియోగంలోకి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. సింగిల్ చార్జర్ ఉండే పాయింట్ల ఏర్పాటుకు కొంతమంది ఆసక్తి చూపుతున్నారు. 3 కిలోవాట్ సామర్థ్యంతో ద్వి చక్రవాహనాల చార్జింగ్ స్టేషన్లు పనిచేస్తాయి. వీటిని అపార్ట్మెంట్ సెల్లార్ ప్రాంతాలు, మాల్స్లోని పార్కింగ్ ప్రాంతాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల ఆవరణలో ఏర్పాటు చేసుకునే వీలుంది. ఖర్చు రూ. 15 వేల లోపే ఉంటుంది.